స్వీటు ద్వేషం

టైటిల్ చూసి ఇదేదో రొమాంటిక్ స్వీట్ నథింగ్స్ గురించి చెప్పే పోస్ట్ అనుకుంటే మీరు పాలకోవాలో కాలేసినట్టే. మిఠాయులపై నిలువెల్లా సెగలు కక్కుతున్న వేడిలో హాట్ హాట్ పోస్టిది.
"పుత్రా పురుషోత్తమా, ఏమి నాయనా ఈ అకాల క్రోధమేమి, ఈ అకారణ వైరి ఏమి " అని మీకు అనుమానం ఆవేదన కలగవచ్చు అందులో తప్పులేదు. మీరు మిఠాయిలకు దాసులైపోయారు మరి. చిన్నప్పటినుండి అలా మిస్‌గైడ్ చేసారు మిమ్మల్ని. లేకపోతే ఏంటండీ ఏదో పిండిలోనో, పదార్ధంలోనో ఇంత లేకపోతే ఇం........త నెయ్యి వేసి (ఇదిగో ఇక్కడే నాక్కాలేది. ఎవరన్నా వేడివేడి అన్నంలోనో కూరలోనో నెయ్యి వేసుకుంటారు చల్లటివాటిపై వేసుకొని తింటారా !? అహా తింటారాంట. కాని అదేంటొ అర్ధం కాదు ice cold నేతి మిఠాయిలంటే చాలు లొట్టలెయ్యాలంట. వెయ్యకపోతే ఒప్పుకోరంట !) ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా కలిపేసి ముద్దచేసి డబ్బాల్లో పెట్టి అమ్మడం అమాయకుల్లా కొనడం. అసలు వేయించిన తినుబండారాలకు ఉండే రుచిలో సగమన్నా ఉంటుందాండీ స్వీట్స్‌కు. మసాల చల్లిన మిర్చీ బజ్జీకు గాని, శనగపప్పు వడలకుగాని, ఉప్పు పచ్చిమర్చి సమేత ఆలు సమోసాలుకు గాని ,   కనీసం అప్పడాలకు సరితూగుతాయాండీ మిఠాయిలు. ఎక్కడా నో మ్యాచ్.


ఈ నిష్టూరమైన సత్యం నాకు చిన్నప్పటినుండి తెలియబట్టి మిఠాయిలకు ఏడంగా ఉండేవాణ్ణి. కాని ఈ సమాజం ఊరుకోదే ఏదో విధంగా లొంగదీసుకోవాలని చూస్తుంది. ఆ కుట్రలో భాగంగానే నా జీవితంలోకి ప్రవేశించింది మైసూర్ పాక్. చిన్నప్పుడు మా ఇంటిదగ్గర్లో ఓ కిరాణా షాపుండేది. ఈ సదరు మైసూర్ పాక్ లు అమ్మేవాడు. పావలాకొకటి. ఇహ మా ఇంట్లో జనం ఎగబడి కొనుక్కునేవాళ్లు. ఓసారలాగే మా అమ్మ ఆ డబ్బా పాక్ కొని తినమని కొంచెం నా చేతికిచ్చింది. దాన్ని బాహ్య స్వరూపాన్ని రకరకాలుగా విశ్లేషించి ఆ కొంచెం లో కుంచెం నోట్లో వేసుకున్నా. ఎబ్బే అస్సలు బాగనిపించలా. అదేమాట అమ్మతో చెబితే 'వద్దంటే మానెయ్, ఇటిచ్చేయ్' అని లాగేసుకుంది, కనీసం నన్ను అభినందించకుండానే! ఇహ అప్పట్లో చుట్టాలింటికి వేళ్ళామో నాకు చచ్చే చావు. వాళ్లేమో మరేమీ దొరకనట్టు ఈ మైసూర్ పాక్ నే పెడతారు. ముందు గొయ్యి వెనక నుయ్యి నా పరిస్థితి. తింటే నాకు పడదు, తినకపోతే వాళ్లకు పడదు.

ఇలా మైసూర్ పాక్ తోనే వేగలేక ఏడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ ను కుదిపేసిన పుల్లారెడ్డి మిఠాయిలు రంగప్రవేశం చేసాయి జీవితంలోకి. అప్పట్లో దీపావళికి దసరాకి నాన్న పనిచేసేదగ్గర పుల్లారెడ్డీ స్వీట్సో, దద్దూస్ స్వీట్స్ ఇచ్చేవారు. ఓ డబ్బా మొత్తం అన్నమాట అందులో అన్ని రకాలు ఉంటాయ్ లడ్డూలు, కోవాలు, కాజాలు వగైరా వగైరా. ఐతే అందులో మేము 'రబ్బరు స్వీట్' అని పిలుచుకునే ఓ పదార్ధముండేది. పేరుకు తగట్టే దాన్ని తినాలంటే అలా ఓ పావుగంట నములుతూనే ఉండాలి. చూసారా ఎంత అన్యాయమో మిఠాయిలు అని చెప్పి ఇలాంటివి పెడతారా తప్పు కదూ.నేనైతే పడేద్దాం అన్నంతపని చేసేవాణ్ణి. ఇదే మాట నాన్నతో చెబితే 'ఛస్, నువ్వు తినకపోతే ఊకో' అని తిట్టేసేవారు. ఠాట్ ఈ మిఠాయిలతో చస్తే దోస్తీ కుదరదు అని తేలిపోయింది.
నా జీవితంలోని ఇంకో మాయదారి మిఠాయి లడ్డూ. అసలీ లడ్డూని ఎవడు కనిపెట్టాడోగాని వాడు దొరకాలి తొక్కుడులడ్డూ చేసినట్టు తొక్కిపడేస్తా. అరే! లడ్డూ ఇష్టం లేదురా మొర్రో అంటే వినరే. పైగా నేనసలు మనిషినేకాదన్నట్టు, ఫ్రెష్‌గా పంచమహా పాతకాలు చేసినవాడిలా చూస్తారు. బంధువులింటికి వెళ్లినపుడు ఆ పాక్‌ తోపాటు ఈ లడ్డూలు కూడా ఉండేవి. వాళ్లు పెడితే నే వద్దనేవాడిని, వాళ్లదోలా చూస్తే మా అమ్మ వచ్చి 'ఏందొనమ్మ ఏం తినడీపిలగాడు. ఎట్ల జెయ్యాల్నో ఏందో!' అనేది. సెంటీ డవిలాగులు. తరువాత ఇలాగే కొనసాగితే వియ్యాలవారి దగ్గ్రర కయ్యం ఐపోతుందేమోనని అప్పుడపుడూ లడ్డూపారాయణం జరిగేది. ప్రతి అమ్మాయికీ లడ్డూలాంటి భర్త కావాలట! ఆ పోలికేంటో నాకర్ధంకాదు.  వారి కోరికను మన్నించి తిరపతి లడ్డూ మాత్రమే అని ప్రకటించేశా- మావాళ్లు శాంతించారు.  పాపం నా బాధను చూసి ఆ తిరపతి వెంకన్న కూడా ఈ మధ్య లడ్డూ తినడం మానేశాడనుకోండి- అందుకే మునుపటంత బాగుండట్లా-అది వేరే సంగతి.

అసలీ స్వీట్స్  షేపులు కూడా సరిగా ఉండవ్. కావాలంటే ఆ జిలేబిని చూడండి. పైగా గోడమీద పోస్టర్ చూసి చొంగ కార్చుకునేవాడిలా దాన్లోంచి రసం. హైదరాబాద్లో ఉన్నన్నాళ్లు నా సంగతి తెలుసుకాబట్టి ఈ జిలేబీలను తిన్నా తినకున్నా ఏమనేవారుకాదు. ఎప్పుడైతే ఖరగ్‌పూర్ కొచ్చామో, హమ్మనాయ్నోయ్, మొదలయ్యాయి కష్టాలు. క్యాంపస్ లో  Tech-market అనుండేది - చిన్నసైజు షాపింగ్ ఏరియా అన్నమాట. దాంట్లో కొన్ని స్విట్-హాట్ బండ్లు. బజ్జీలు జిలేబీలు చేస్తారు. ఎపుడైనా ఫ్రెండ్స్ తో కలిసి అటువైపు వెళితే మరేం దొరకనట్టు జిలేబీలంటూ లొట్టలేసుకుంటు వెళ్ళెవాళ్లు. పక్కనే వంకాయ్ బజ్జీలనీ, ఆలూ వడలనీ ఎన్నున్నా పట్టించుకోరు. నేనేమో 'నాకొద్దు, ఇష్టంలేదు' అనంటే ముష్టివాడికన్నా హీనంగా చూసేవాళ్లు. అదేదో సినిమాలో వెంకీ చెప్పినట్టు ఆ చూపులో లక్ష బూతులెతుక్కోవచ్చు. కొన్నిరోజులు ప్రతిఘటించి, నీరసించి ఆపైన పాక్షికంగా తెల్లజెండా ఎగరేసా. జిలేబీ వేడిగా ఉంటేనే తింటా అది కూడా మాక్జిమమ్ ఒకటి అని. అప్పటికిగాని నా మీద సెటైర్లు ఆగేవి కావు.
కాని నేనూరుకుంటానా, సిక్కిం ట్రిప్ వెళ్ళినపుడు పరిచయమైందో అద్భుత హాట్ వంటకం. పేరు మోమో. చుసారా పేర్లోనో ఎంతటి టేస్టుందో. వేడి వేడి మోమోను సాస్‌లోనో, వాళ్లిచ్చే పచ్చడితోనో తింటె ఉంటది నా సామిరంగా.....అబ్బో కెవ్వు కేక. కాని ఈ స్వీటు ప్రేమికులకు ఇది నచ్చలేదు. హెందుకు నచ్చుతుంది వొళ్లంతా స్వీటు షుగరు పట్టిందిగా. అప్పుడు వాళ్లన్నారు 'నోనో- మోమో' అని. ఈసారి వాళ్లను వింత చూపు చూడటం నా వంతైంది.

పైగా ఈ స్వీటు బాగోతం ఇప్పుడు బజ్జులకెక్కింది. అబ్జర్వ్ చేస్తూనేవున్నా వారం రోజులనుండి ఒకటే తీపి పోస్టులు. వెన్న కాచిన నెయ్యితో చేసిన మిఠాయిలంట. ఇంటినుంది తెప్పించుకున్న మిఠాయిలంట.... ఠాఠ్! అసలీ పెపెంచకంలో మిఠాయి అనేదే లేకుండా చెయ్యాలి ముందు. అంతవరకూ నే శాంతించ.

ఎంత స్వీటు ద్వేషినైనా నేను మడిసినే, నాకు కళాపోసణుంది, నేనూ జన జీవనస్రవంతిలో భాగమే. పాలకోవాలన్నా, రస్‌మలై అన్నా, గులాబ్ జామ్ అన్నా నాకూ పేమే. అవి తప్ప మిగతా మిఠాయిలన్నీ రూపుమాపాలని ఉక్కు సంకల్పం. రండి నాతో చేయి కలపండి

భగవంతుడికి మోక్షం వుంటుందా ?

ముందుగా టపా శీర్షికకు అంతగా సంబంధంలేని ఓ విషయం మాట్లాడుకుందాం. సృష్టిరచన జరగకముందు, వివిధ మతాలనూ తత్వాలనూబట్టి, శూన్యమో దేవుడో ఉండేది (భగవంతుడికి లింగం లేదు గనక ఉండేది అంటే సమంజసమేనని అనుకుంటున్నా). దేవుడు ఆజ్ఞాపించగానే శూన్యంలోని శక్తి మార్పుచెంది ఇప్పుడు మనం చూస్తున్న సమస్త చరాచర జగత్తుగా రూపుదాల్చింది. కొంచెం లోతుగా చూస్తే శక్తి మొదట పదార్ధంగా మారి ఆపైన పరమాణువుగా, అణువుగా, మూలకంగా... ఈ క్రమానుసారంగా ప్రాణిగా రూపాంతరం చెందింది. ప్రాణికి ఉండే 'బుద్ది' కారణంగా అది ఆలోచించగలదు. భౌతిక శాస్త్ర నియమం ప్రకారం దేన్నీకూడా ఏమీలేని శూన్యం నుండి సృష్టించలేము. శక్తిని సృష్టించలేము దాన్ని కేవలం ఒక స్వరూపం నుండి మరొక స్వరూపంలోకి మాత్రమే మార్చగలం. అంటే బుద్ది కూడా శక్తి స్వరూపమే అయ్యుండాలి అయితే నిర్గుణమైన శక్తి క్రమపద్దతిలో 'బుద్ది'గా మారిన తరువాత దానికి ఏదో ఒక గుణం చేకూరడం ఆశ్చర్యకరం. ఇప్పుడు మళ్లీ బుద్ది ఉన్న ప్రాణి దగ్గరికి వద్దాం. ప్రాణుల్లో వాటివాటి పరిమాణక్రమాన్ని అనుసరించి, అంటే ప్రాణుల్లో ఉత్కృష్టమైనవి మోక్షన్ని కోరుకుంటాయట. వాటి అంతిమ లక్ష్యం మోక్షం పొందటమే. మోక్షానికి మోక్షానికి మధ్య ఆత్మ/ప్రాణి సాగించే యాత్రే జనన మరణాలు అని అంటువుంటారు. మార్పుంటూలేని, స్వఛ్చమైన, నిర్మలమైన ఆ మోక్షం ఏమై వుండవచ్చు ? సృష్టిరచన జరిగేముందు ఉన్న శక్తి కావచ్చునా ? సృష్టిరచన ఉద్దేశ్యం మరొక సృష్టి అవసరంలేని శక్తి సహిత శూన్యంలోకి వెళ్లడమా ?

ఇక టపా శీర్షిక గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసి హైందవ ధర్మంలో, బౌద్ధంలో మోక్షమనే జనన-మరణరహిత స్థితి ఉంటుంది. దేవుడి ఇఛ్చనుబట్టి, ప్రాణి పూర్వకర్మలనుబట్టి మోక్షస్థితి పొందటమా లేక మరోసారి జన్మనెత్తడమా నిర్ణయించబడుతుందట.  ఇస్లాం, క్రైస్తవంలో ఇటువంటిది లేదనుకుంటా. ఆ మతాల్లో దేవుడు ప్రాణులని సృష్టిస్తాడు సుకర్మలద్వారా ధర్మాచరణ చేసిన ప్రాణులకు ఉర్ద్వలోకాల్లో సుఖసంతోషాలను ఇస్తాడు. ఐతే ఈ అన్నీ ధర్మాలలో, మతాలలో దేవుడు నిరంతరం సృష్టిరచన చేస్తూనే ఉంటాడు. హైందవ ధర్మం తీసుకుంటే కొన్ని మహాయుగాల తరువాత ప్రళయంలో సృష్టి అంతా లయమౌతుంది ఆ తరువాత కొత్త సృష్టి మొదలౌతుంది(ట). మిగతా మతాలలో దేవుడనేవాడు ప్రాణులను సృష్టించడం నిరంతరం చేస్తూనే ఉంటాడనుకుంటున్నా. ఐతే సర్వజ్ఞుడైన దేవుడికి ప్రాణిని సృష్టించాల్సిన అవసరం ఏముంది ? తను తప్ప మరెవరూలేనపుడు ఎవరికి ఏం తెలియజేద్దామని సృష్టిని చేసాడు ? పైన చెప్పుకున్నట్టు దేవుడు నిరంతరం సృష్టిరచన చేయడానికి బద్దుడైతే అతను మోక్షప్రదాత ఎలా కాగలడు ? 
If He knows all and every thing why then there is a creation ?

If He is not free Himself, how can he free others ?

బుక్కు, రెండొ బుక్కు, మూడొ బుక్కు

RK Narayan - భారతీయ ఆంగ్ల సాహితీ లోకంలో ఈ పేరు వినని వారుండరంటే అతిశయోక్తి కాదు. 'మాల్గుడి' అనే అధ్బుత కాల్పనిక లోకాన్ని ఆవిష్కరించిన ఘనుడు ఆయన. చిన్నపుడు దూరదర్శన్ లో మాల్గుడి కథలు ప్రసారమయేవి, కాలక్షేపానికి బానే అనిపించేవిగాని ఓ పట్టాన అర్ధమయ్యేవికావు. కొంచెం పెద్దాయ్యాక పాఠ్యపుస్తకాల్లో ఆయన రచనలు కొన్ని ఉండేవి. చిన్న చిన్న కథలు అవి. నేటివిటి ఉన్నా అంతగా ఆకట్టుకోలేదు. ఇంజనీరింగ్ వచ్చాక స్నేహితుడొకడి దగ్గర ఆయన రాసిన The English Teacher ఉంటే తెచ్చుకొని చదవటం మొదలుపెట్టా. అప్పటికి మా-టివి లో మాల్గుడి కథలు పునః ప్రసారమౌతుండేవి కాని ఆ డబ్బింగ్ వినలేక వదిలేసా. నవల చదవటం మొదలు పెట్టానోలేదో ఆ శైలి నన్ను కట్టి పడేసింది. అరే! చాలా సాధారణమైన పరిసరాల వర్ణన, ఆర్భాటం లేని మనస్థత్వలతో పెద్ద మాయలు చేసాడు. చెప్పాలంటే ఆయన రచనల్లో  జలపాతాలో, పూలతోటలో కాకుండా మామూలువి అనుకునే ఓ టేబుల్, ఓ పెన్ను, ఓ చెంబు, దేవుడి గూట్లో అగర్బత్తి లాంటివే ఎక్కువుంటాయి. అవే కథలో రమణీయతకు సహాయం చేస్తాయి. మాల్గుడి ప్రస్తావన తీసుకువస్తే పాఠకుడు ఎలాంటి పరిస్థితిలో  ఉన్నా  తనూ ఆ ఊర్లో భాగమైపోవాల్సిందే. అన్ని కథలు ఆ మాల్గుడిలోనే జరుగుతాయ్, ఆ ఊరితో ఏదో సంబంధం ఉంటుంది, అయినా ఎన్నిసార్లు ఆవూరి ప్రస్తావన వచ్చినా విసుగనిపించదు పైపెచ్చు 'ఈ సారి ఊర్లో ఏం జరగబోతుందో !' అనే కుతూహలం కలుగుతుంది.అలా ఆయనకు పెద్ద పంఖానైపోయి మొన్నీమధ్య ( అంటే ఓ ఏడెనిమిది నెలల ముందు) Waiting for the Mahatma పుస్తకం కొన్నా. కాలేజిలో ఉండంగా వారానికో పేజీ చొప్పున చదివీ చదవలేక పక్కనపడేసా. ఇంటికొస్తూ టైంపాస్ కోసమని రైల్లో చదవటం మొదలుపెడితే ఇంటికొచ్చేసరికి పూర్తయింది :).   ఇప్పటివరకు నే చదివిన నారయణ్ గారి పుస్తకాల్లో ది బెస్ట్.  భారతి-శ్రీరాం-మాహాత్ముడి చుట్టూ కథ నడుస్తుంది. శ్రీరాం  చిన్నపుడే తల్లిదండ్రులు చనిపోతే నానమ్మ పెంపకంలో పెరుగుతాడు. మైనారిటీ తీరాక శ్రీరాం పేరిట  బ్యాంకులో ఉన్న డబ్బును తనకే అప్పజెబుతుంది నానమ్మ. అసలే కుర్రోడు పైగా  బ్యాంకు బ్యాలెన్సువుంది కనుక పనీపాట లేకుండా  అవసరంవున్నా లేకపోయినా డబ్బు ఖర్చు చేస్తూ దర్జగా బతికేస్తుంటాడు.

ఇదిలా ఉండగా ఒక రోజు బజారులో శ్రీరాంకు భారతి  కనపడుతుంది, ఆ ఆమ్మాయి అందానికి ముగ్ధుడైపోతాడు. ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తే స్వాతంత్ర్యోద్యమ భాగంలో గాంధీగారి గ్రామసభ ఏర్పాట్లు చూసుకునే సభ్యురాలు అని తెలుసుకుంటాడు. ఇంటిదగ్గర నానమ్మ సంగతి మర్చిపోయి భారతిని వెతుక్కుంటూ వెళతాడు. చివరికి భారతిని కలుసుకొని ఆమెపట్ల తన ఇష్టం గురించి చెప్పి ఆమే స్పందన కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ తరువాత భారతి ఏం చెప్పింది, దానికి శ్రీరాం ఏం చేశాడు అసలు వీళ్లిద్దరి కథకు మహాత్ముడికి సంబంధం ఏంటొ తెలియాలంటే- పుస్తకం కొనండి, చదవండి happy
  కథ చాలావరకు శ్రీరాం చుట్టు తిరుగుతుంది. భారతి కోసం తనేం చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్లాడు, ఎటువంటి పరిస్థుతులను ఎదుర్కున్నాడు అని.  ఐతే నన్ను ఆకట్టుకున్న పాత్ర భారతి, తను ప్రత్యక్షంగా లేనపుడు శ్రీరాం ఆలోచనల్లో భారతి.She's one with a firm attitude and the way she conducts herself, guides Sriram is just wonderful. మిగతా ఆకర్షణగా నారాయణ్ గారి హ్యూమరసం, మాల్గుడి ఉండనే ఉన్నాయి.
(Photo collected form Penguinbooksindia.com )

ఇక ఇప్పుడు మీకు రాంబాబును పరిచయం చేయాలి. ఎవడు, ఎవరయ్యా ఈ రాంబాబు అంటారా. వస్తున్నా అక్కడికే వస్తున్నా. రాంబాబు ఈజ్ ఎ సీనియర్‌మోస్ట్ వెటరన్ బడ్డింగ్ పార్ట్‌టైమ్ జర్నలిస్ట్-జాయింట్ ఎడిటర్ (ఆల్మోస్ట్ ఎడిటర్ ) ఆఫ్ సుజనమిత్ర -థి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ప్రోగ్రెసివ్ తెలుగు డైలి పబ్లిష్డ్ ఫ్రం చింతల్‌బస్తీ. చూసారా పరిచయం చేయడానికే ఇంత శ్రమ పడాల్సొచ్చిందంటే ఆయనెంత గొప్పవాడో మీరే ఊహించుకోండి. రాంబాబుకు ఆసక్తి కలిగించని అంశంలేదు సంగీతం, సాహిత్యం, సైకో అనాలసిస్సు, రాజకీయం,  మరదలుని అప్పుడప్పుడు పక్కింటమ్మాయిని ప్రేమించడం...అబ్బో ఒకటేమిటి ఏది ఎదురైతే దాంట్లోకి ప్రవేశం చేయాలనుకుంటాడు. అన్నిటికన్నా ఎక్కువ ఆసక్తి డైరీ రాయడం. ఆ ఆసక్తి పాఠకులకు టన్నులకొద్దీ హాస్యాన్ని పంచే దివ్యౌషదం. రాంబాబు డైరి కనుక చదువుతున్నారు అంటే జంధ్యాలగారి సినిమాలు back-to-back చూసినట్టే. అతని మేధోసంపత్తిని ఉదహరించే కొన్ని ఆలోచనలు మీకోసం,

౧) ఇంగ్లీష్ అంత దరిద్రపుగొట్టు భాష మరోటి ఉండదు.  తెలుగులో గాడిదా అంటే ఆ పదాన్ని ఎప్పుడు ఎక్కడ వాడినా దానర్ధం గాడిదే.  కాని అదేంటో ఇంగ్లీష్‌లో animal=పశువు , husband= భర్త,minister= మంత్రి కాని animal husbandry minister= పశుభర్తృత్వశాఖా మంత్రి అంటె తప్పంటారు, Non-Political = అరాజకీయం అంటే తప్పంటారు. స్టుపిడ్ !

౨) అలాగే క్రికెట్టంత దరిద్రపుగొట్టు ఆట మరోటిలేదు. ఎప్పుడూ బ్యాట్స్‌మెనే ఔటౌతారంట. యే ఆ బౌలర్లు, ఫీల్డర్లు ఔటావచ్చుగా, పైగా ఇద్దరు బ్యాట్స్‌మెన్ మీదకు పదకొండు మంది దాడి చేస్తుంటారు. ఇది చాలా అన్యాయం. దీన్ని ఖండించాలి.

౩)ఎన్నికలపుడు ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా ఎన్నికల అనంతరం దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెసు, భా.జ.పా కలిసిపోవాలి. లేకపోతే ఒకరిమీద మరొకరు సోదాలు చేసుకుంటూ సమయం డబ్బూ రెండూ వృథా.

౪)చార్లీ  చాప్లిన్ కు అసలు నటనే రాదు రాజ్ కపూర్‌ను అనుకరించటం తప్ప. అది కూడా రాజ్ కపూర్ పుట్టకముందే అతణ్ణి అనుకరిస్తూ నటిస్తాడు.

ఇలాంటి మహత్తరమైన ఆలోచనలతోపాటు మీకు నర్మగర్భాలంకారం, అన్యాపదేశాలంకారం లాంటి సరికొత్త భాషా ప్రయోగాలు కూడా తెలియాలనుకుంటే రాంబాబు ను పలకరించాల్సిందే. నండూరి పార్థసారధిగారు మూడు భాగాల్లో అందించిన  హాస్యపు విందు భోజనం రాంబాబు డైరి.







అతలుకైతే ఈ టపాలో ముచ్చటగా ఏ ఫ్పదో డెబ్బైయ్యో సంగతులు చెప్పేద్దామనుకున్నా. కాని ముచ్చటగా ఎప్పుడూ మూడే ఉండాలంట. అలాగైతేనే కుదురుతుందని కొత్త మేష్టారు చెప్పారు. అందుకని మూడు మాత్రమే చెప్పుకుందాం.
మరి మూడనగానే మీకేం గుర్తొచ్చింది ?
గాంధీగారి మూడు కోతులు.
మరి కోతులెక్కడ ఉంటాయి?
కొమ్మలమీద.
చూసారా చెప్పాలనుకున్న పుస్తకం పేరు మీతో ఎలా చెప్పించానో 'కోతి కొమ్మచ్చి' అని.
%#$(*$@)(*
వద్దు మీరు నా ప్రతిభా పాటవాలను మెచ్చుకోకండి, నే తట్టుకోలేను. big grin

తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రుడైన పిడుగు బుడుగును సృష్టించిన రమణ, బాపుతో కలిసి ఆబాలగోపాలాన్ని అలరించిన సినిమాలు తీసిన రమణ, రాత-గీత  ద్వయంగా నిలచిన స్నేహంలోని రమణ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశిష్ట విషయాలు చెప్పుకోవచ్చు ఆ మహానుభావుడి గురించి. ఆయన ఆత్మ-బాపుకథ  కోతికొమ్మచ్చి, చాలా  కుంచెం ఆలస్యంగా దొరకబుచ్చుకున్నా. మూడు భాగాలుగా ఉన్న ఈ పుస్తకంలో ఆయనను గురించి ఆయనకు పరిచయంవున్నవాళ్ల గురించి నిర్భయంగా చెబుతుంటే ఒకోసారి 'వావ్ నిజంగానా' అనిపిస్తుంది ఒకోసారి 'వార్ని! ఇలాటి కతలు కూడా ఉన్నయ్యా' అనిపిస్తుంది. ఔను మరి 'ఇది రాయాలి, ఇలానే రాయాలి' అని అనుకోకుండా మనసుకు ఏది గుర్తుకువస్తే అది రాస్తే, నిజాలు రాస్తే అలానేవుంటుంది. ముందైతే కోతికొమ్మచ్చిలో మొదటిభాగం మాత్రమే కొన్నా, చదువుతుంటే చాలా ఆసక్తిగా అనిపించడంతో ఏకబిగిన అలా చదువుతూఊఊ వెళ్లిపోయా, రెండురోజుల్లో అయిపోయింది. హమ్మయ్య, వావ్ నేనేనా ఇలా చదివేసింది అని అనుకుంటుండగా అనిపించింది రోగం తెచ్చే మందైనా, రోగం కుదిర్చే మందైనా కుంచెం కుంచెం సేవించాలి తరించాలి అని. ఆ పద్దతిలో మిగతా రెందు భాగాలు ఆడుతూ పాడుతూ ముగించా. మొత్తంగా చూస్తే కోతి కొమ్మచ్చి లో మొదటి భాగం పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఎందుకూ అని అడిగితే అందులో రమణ బాల్యంవుంది, బాపుతో మొగ్గతొడిగిన స్నేహంవుంది, చెన్నై నగరంలో పడిన సాపాటు పాట్లు ఉన్నాయ్, ఆ పాట్లలో పాడుకున్న పాటలున్నయ్, పాత్రికేయుడిగా అనుభవాలు ఉన్నాయ్, ఒక స్థాయికొచ్చాక తాను వెలిగించిన సిగరొత్తుల పొగరెట్ కథలు అవి ఇచ్చిన వగరు రుచి వుంది. పుస్తకం చదివేముందు ముందు చదివిన వెనకమాటలో చెప్పినట్టు దరిద్రాన్ని ఇంత రొమాంటిక్‌గా కూడా చూడవచ్చా !? అనే ఆశ్చర్యం కలుగుతుంది.

రెండు మూడు భాగాల్లో బాపుతో కలిసి మొదలుపెట్టిన సినిమా ప్రస్థానం వుంది. రెండవ భాగం అయ్యాక ముడొభాగం చదివేందుకు కొంచెం బాధ కలిగింది, చెప్పవలసిన విషయాలు చెప్పకుండానే వెళ్లిపోయాడా పెద్దమనిషి,  ఆయన లేరనే విషయం గుర్తొచ్చేది.
ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవితం మొదలుపెట్టిన తొలినాళ్లలో రమణ కథలు,వ్యాసాలు గట్రా రాసుకొని, బాపుతో బొమ్మలు గీయించుకొని పత్రిక కార్యాలయాలకు వెళ్లేవాడట అవి చూసి ఇడ్లీ కంటే పచ్చడి బావుంది అనేవారట. అచ్చం అలానే పుస్తకంలో కొన్ని చోట్ల రమణ రాసిందానికన్నా బాపు వేసిన బొమ్మలు ఆకట్టుకుంటాయ్. మొదటి భాగంలో రమణ అమ్మగారు పచారికొట్టువాడి కాంట్రాక్టు పోయినందుకు భయపడలేదు అని చెప్పడానికి బాపు వేసిన బొమ్మ భలేగా అనిపించింది. అరే అంతపెద్ద కష్టాన్ని ఆయన సింపుల్‌గా చెప్పడమేంటి ఈయన అంతకంటే సింపుల్‌గా నవ్వొచ్చేట్టు వేయడమేంటి అనిపిస్తుంది. అంతగా అర్ధం చేసుకున్నారా ఒకరినొకరు అనుకునేంతలోపే బాపుతో కూడా లడాయిలు వేసుకున్నా, ఆయనతో కూడా బడాయికిపోయా అని ఒప్పేసుకుంటాడు.

ఇంకొన్నేళ్లు బ్రతికివుంటే మరిన్ని కొమ్మలు ఎక్కి మరింత సంబరం కలిగించేవారు రమణ.
పుస్తకంలో రమణ అంటాడు, రాముడు తనపై చాలా ప్రేమను కురిపించాడని. రామాయణం రాయించుకునే పనిలో తనకు పుణ్యం ఇచ్చి, సంపూర్ణ రామాయణం తీయించి, ఆపై  ఈ-టివీ భాగవతం లో మరోసారి కరుణించాడని. విధి విలాసమో ఏమో ఈసారి మరోసారి రాముడి కథను తెరకెక్కిస్తుంటే ఆ రాముడే తనదగ్గరకు  పిలిపించుకున్నాడు.

తెలుగుబాట

మొన్నటి ఆదివారం రోజున e-తెలుగు వారు 'తెలుగు భాషాదినోత్సవం' సందర్భంగా తెలుగుబాటను నిర్వహించారు. కార్యక్రమం జరిగేది హైదరాబాదులోనే కాబట్టి నేను కూడా పొలోమంటూ వెళ్లాను. అప్పటికి చాలా రోజులనుండి బ్లాగులలో, బజ్జుల్లో, ఫేస్‌బుక్, ఆర్కుట్‌లో కార్యక్రమం గురించి ప్రచారం జరుగుతూ వచ్చింది. కార్యక్రమం ఉదయం 9:00 నుండి మొదలౌతుంది అని తెలుసు, కాని ఇండియన్ టైము ప్రకారం ఓ ఇరవై నిముషాలు ఆలస్యంగా వెళ్లాను :D. అప్పటికి e-తెలుగు సభ్యులు కరపత్రాలు, బ్యానర్లు సిద్దం చేస్తున్నారు. చేరుకోగానే లినక్స్ ప్రేమికులు రెహ్మాను, ప్రవీణ్ ఇళ్ళ పలకరించారు. ఓ స్టిక్కర్ లాంటిది అతికించేసి ఓ పెద్దాయనకు నన్ను అప్పగించేసి రెహ్మాన్ చక్కా వెళ్లిపోయాడు, తన పనిలో నిమగ్నమైపోతూ, అందరిని సమన్వయపరుస్తూ. 'హలో', ' హాయ్', 'గురూ గారు మీరా!!' అనుకున్నాక ఆ పెద్దాయన అంచేత నే చెప్పోచేదేంటంటే అబ్భాయ్ ఇంద ఈ బ్యానర్‌ను ఓ చేత్తో పట్టుకో ఇంకో చివరను నే పట్టుకుంటా అన్నారు. అలగే అనేసి అక్కడికి వచ్చిన రిపోర్టర్లకు సామూహికంగా ఫొజులిచ్చి నడక మొదలుపెట్టాం. 

దారివెంట తెలుగు గురించి నినాదాలు చేస్కుంటూ నడిచాం ఆదివారం కాబట్టి నడక మార్గంలో జన సందోహం ఎక్కువగా లేదు. ఇలాగైతే ప్రయోజనం ఉండదనుకొని సిటిబస్సులు ఎదురవగానే కొంచెం స్వరం పెంచి గట్టిగా అరవడం మొదలుపెట్టా, పాపం మిగతావారు అది 'యువరక్తం', 'ఉత్తేజం' అని అనుకున్నారేమో !! ఐతే మా అందరికంటే చురుగ్గా నడక ఆసాంతం ఓ పెద్దాయన ముందుండి నినాదాలు చేయించారు. ఆయన 'యువభారతి' అనే సాంస్కృతిక సంఘం సభ్యులట. మిగతావారందరం సగం దూరం అయ్యేసరికి డీలా పడిపోతే ఆయన మాత్రం రెట్టించిన ఉత్సాహంతో నినాదాలు చేశారు. నడక ముగిసిన తరువాత తెలుగు విశ్వవిద్యాలయంలో సభను నిర్వహించారు. సభలో మాట్లాడిన వక్తలపేర్లు ఒకరిద్దరివి తప్ప గుర్తులేదు. అందులో ప్రస్తావించిన విషయాలు స్థూలంగా...
౧)తెలుగు  భాష మనుగడ సాగించాలి అంటే ఆ పనికి ప్రజలే పూనుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వాలను, పాశ్చాత్య పోకడలను నిందించడమో సరికాదు.
౨) భాష వాడుకలో ఉండాలి అంటే ప్రభుత్వాలు, ప్రసార సాధనాల బాధ్యత కూడా ఉంటుంది. ఈ రెండింటికి ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది.
ఈ రెండూ కాస్త పరస్పర విరుద్దంగా అనిపించినా సబబుగానే తోచింది.

సభ ముగిసిన తరువాత విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి పెద్దలు పూలమాలలు తొడిగారు. మాలాటి కుర్రవెధవలం ఒకరితో ఒకరం పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, ఫొటోలకు ఫోజులిచ్చుకున్నాం. ఇప్పటిదాకా బ్లాగు/బజ్ ద్వారా మాత్రమే తెలిసిన బ్లాగర్లు తెలుగుబాట ద్వారా ప్రత్యక్షంగా కలిసారు. చాలా ఆనందం కలిగింది.









కోతికొమ్మచ్చి:

మొన్నొకరోజు ఓ దగ్గర వెయిట్‌చేస్తూ కూర్చున్నా. నా వెనక ఇద్దరు అమ్మాయిలు,అప్పటివరకు ఒకరికి ఒకరు పరిచయంలేదు, మాట్లాడుకుంటున్నారు.  అబ్బో, ఇంగ్లీష్ లో దడదడలాడించేస్తున్నారు 
" Yeah, Hyd is such a beautiful city. I very much wish to settle here........ etc etc"
"We stay in XYZ area, actually we are going out on a holiday trip this sunday to ABC..."
"so it is gonna be a funday trip :) "
"WoW ! how beautiful "
etc etc

ఇంతలో రెండో అమ్మాయ్ ఫోన్ మోగింది, తను లిఫ్ట్ చేసి " ఆ నాన్నా, పని ఇంకా అవలేదు. మరోగంటసేపు పట్టోచ్చు....."అనేసి పెట్టేసింది. ఓహో అమ్మి తెలుగే! అని మనసులో అనుకుని వారి మాటలు అలాగే వింటున్నా. 
ఇంతలో మొదటి అమ్మాయి ఫోన్ మోగింది, ఆమె లిఫ్ట్ చేసి " ఆ... నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. ఓ హండ్రెడ్ వెయ్యమను...." అంది. వార్ని ఇద్దరు అమ్మిలు తెలుగేనా అని ఆశ్చర్యపోవడం నావంతైంది.

జై తెలుగు!  జైజై తెలుగమ్మాయిల్స్ !

మేరా భారత్ మహాన్

భారత ప్రభుత్వంవారికి,
అయ్యా  ఈరోజు మీకు శుభాభినందనలు తెలియజేయడానికి నాకు నోటమాట కరువౌతోంది. మొన్నీమధ్యనే జరిగిన ముంబాయి పేలుళ్లను మరవకముందే రక్తసిక్త చేతులతో పట్టుబడ్డ కసబ్‌గారు అథిదిగృహం లాంటి జైలులో పట్టుమని ఓ పదికేజీల బరువు పెరగకుండానే మళ్ళి పేలుళ్లు జరిగాయంట!  సంతోషం. నావొళ్లు పులకించిపోయింది. మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా భావించే ఉగ్రవాదులకు మన రక్ష్యణా వ్యవస్థ, గూఢచర్య వ్యవస్థ మరీ తిసికట్టుగా తయారైయ్యేట్టు చేసినందుకు మీకు శతకోటి వందనాలు. పార్లమెంటు మీద దాడి చేసిన అఫ్జల్‌ను, రె‌డ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కసబ్‌ను భవిష్యత్తులో పట్టుబడబోయే మరేయితర ఉగ్రవాదినో సిగ్గు-శరం లేకుండా ఉంటూ ఏమి చేయలేని మీ రాజనిరతికి నా జోహార్లు. ఇవాల్టి ఈ పనికి పైలోకంలోని వందలాది ఉన్నికృష్ణన్లు, కామ్టేలు, కర్కరేలు ఆనందభాష్పాలు రాలుస్తుంటారు. మీకు హ్యాట్సాఫ్.


ఏదేమైనా సారూ మనకి ఈసారి కూడా అదృష్టం కలిసిరావాలని కోరుకుందాం. ఏ రాముగాడో, సోమూగాడో సంఘటనా స్థలానికి వెళ్ళేలా చేద్దాం. 
వాడిచేత ఓ బ్రహ్మాండమైన సినిమా తీయిద్దాం. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదం పై మనం జరిపే పోరుకు అందరూ మద్దతివ్వాలని కోరుకుందాం. సొల్లు కబుర్లు చెప్పుకోడానికి వీలయ్యే దైపాక్షిక చర్చలకు సానుకూల వాతావరణం కలగాలని కోరుకుందాం. ఎంచక్కా మన మంత్ర్లులు వాళ్ల అనుచరగణం టీవీల్లో, పేపర్లలో దర్జాగా పబ్లిసిటీ ఇప్పించుకోవచ్చు. నా భ్రమగాని ఈ పాటికే మీ మేనిఫెస్టో లోని సగటు మనిషి/ ఆమ్ ఆద్మీ/common man ఈ బాధ్యత తీసుకొని ఉంటాడు. రేప్పోద్దున చూడండి ఏ భయం లేకుండా ముంబాయ్ రైళ్లలో, బస్సుల్లో ప్రయాణం చేస్తాడు. ఛాయ్ బండ్ల దగ్గర సమోసాలు తింటాడు. ఉగ్రవాదులకు మేము భయపడము అని వార్తా ఛానల్లు ఊదరగొట్టుకునేలా చేస్తాడు. ఆ పేరుతో మనందరం చంకలు గుద్దుకొవచ్చు. ఆ పిచ్చి ఛానళ్లకు అసలు సంగతి తెలీదు, పనికెళ్లకపోతే తిండి దొరక్క చస్తాడు ఆ సగటు మనిషి. దానికన్నా బాంబులు ఉంటాయో ఉండవో అని 
అనుమానపడుతూ, తననుతాను సంబాలించుకుంటూ వీధుల్లో తిరుగుతుంటాడు. సగటు మనిషికి అలాంటి మహర్ధశ పట్టించిన మీకు ఎన్ని కితాబులిచ్చినా తక్కువే.

కొన్ని రోజులపాటు న్యూస్‌పేపర్లు, టీ.వీ ఛానళ్లు మీమీద బురద జల్లుతాయి. పోలీసు వ్యవస్థను నీరుగార్చారని, సరిపడ నిధులు  ఇవ్వలేదని. మీరేమి వాటిని చెవికెక్కించుకోవద్దు. పోలీసులను నేతల ఇళ్లదగ్గర, సమావేశాల దగ్గ్రర  కాపలా కుక్కల్లా పెట్టేసుకోండి. ఎదురు మాట్లాడినవాడి పీక నొక్కడానికి వాడండి. ప్రతిపక్షం గతజన్మలో చేసిన అవినీతితి గురించి, తప్పొప్పుల గురించి యేళ్లతరబడి ఉపన్యాసాలు దంచండి. ఎవరైనా ఓ ఇంటిపై దాడిచేస్తే, ఆ ఇంట్లో మగాడు ఏం చేయలేకపోతే వాడికి గాజులు తొడిగి మూల కూర్చోబెడతారు. మీమీద ఉన్న అమితమైన వాత్సల్యం, అభిమానం, ప్రేమ కొద్ది మేమా పనులు ససేమీరా చేయం. దర్జాగా ఏలుకోండి, మమ్మల్ని దోచుకోండి. ఇలాంటి దాడులు జరిగినపుడు ఏవో పదో పరకో ప్రాణాలు పోతాయ్. వెధవది గాల్లో దీపాల్లాంటివి ఆమ్ ఆద్మీ ప్రాణాలు మీరు దేశానికి చేయబోయే విశాల ప్రయోజనాలకంటే ఎక్కువకావు. నిస్సిగ్గుగా ఉండండి. మీరు మాకు దొరకడం మా పూర్వజన్మ సుకృతం.

మేరా భారత్ మహాన్. మేరా నేతా మహాన్.

PS: అయ్యా ఉగ్రవాదులూ తమరు ఎంతో కష్టనష్టాలొనర్చి, పెద్ద పెద్ద ప్రణాళికలు వేసి చిన్నచిన్న బాంబులు పెడుతున్నారు. ఇకపై అంత కష్టం తీసుకోకండి. ఎక్కడ దాడి చేయనున్నారో నేరుగా మా ప్రభుత్వానికే తెలియజేయండి. మీకు సకల సదుపాయాలు కల్పిస్తుంది. ఒకవేళ పోలీసులో కమేండోలో అనవసర సాహసం చేసి పట్టుకుందనుకోండి మీరు ఈ దేశానికి చేసిన మహత్తర సేవకుగాను మీకు దేశంలో ఎవరికీలేని రక్షణమధ్య రాజమర్యాదలు ఉంటాయి. ఆ బంగారు అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. కాకపోతే ఒక్క విన్నపం, దేశ రక్షణ అంటే పవిత్రమైన పని అని ప్రాణాలిచ్చైనా దీని సార్వభౌమత్వాన్ని కాపాడాలని సరిహద్దులోని మా వెర్రి సిపాయిలు, పోలీసుల్లో కొందరు అమాయకులు అనుకుంటున్నారు. కాబట్టి మీరు వచ్చే సమయంలో మా గవర్నమెంటువారికి ఆ సిపాయిలను, పోలీసులను కాసేపు తప్పించమని చెప్పండి. పాపం వారు మధనపడకుండా ఉంటారు. ఎప్పటిలాగే మేము మీ రాకకై ఎదురుచూస్తూ, మీ చేతుల్లో ప్రాణాలొదలడానికి సిద్దంగా ఉంటాం

ఇట్లు,
సగటు మనిషి.

Writer లక్షణాలు

 'The Alchemist', 'The Pilgrimage' వంటి ప్రపంచ ప్రసిద్ద నవలలు రాసిన బ్రెజిల్ రచయిత, ఆథ్యాత్మికవేత్త Paulo Coelho తన  పదిహేనవయేట తన తల్లితో తాను పెద్దయ్యాక రచయితను అవ్వాలనుకుంటున్నానని చెప్పాడట. అపుడు వాళ్లమ్మగారు ' మీ అంకుల్ ఓ డాక్టురు, కావాలంటే నువ్వు కూడా ఏ ఇంజనీరో అయ్యి ఖాళీ సమయాల్లో రాయొచ్చు. పైగా అసలు writer (రచయిత/రచయిత్రి) అంటే ఏంటో నీకు ఖచ్చితంగా తెలుసా?'ని  అడిగిందంట. దానికి సమాధానంగా ఖాళీ సమయాల్లో పుస్తకాలు రాసే రచయిత కాకుండా పూర్తిస్థాయి రచయిత కావాలనుకుంటున్నాను అని చెప్పేసి రచయిత అంటే ఎవరు, ఏమిటి అని కొన్నాళ్లపాటు పరిశోధన చేసాడు. వాటిని తన అమ్మగారికి చెప్పేసేసి అటుతరువాత ఎలాగో అలా ప్రసిద్ద రచయిత అయ్యాడనుకోండి. ఐతే తాను రచయిత/రచయిత్రి ల పై జరిపిన పరిశోధనల తాలుకు ముఖ్యవిషయాలను తన పుస్తకం 'Like the Flowing River'  'ముందుమాట'లో చెప్పాడు. అవి మీతో పంచుకుందామని ఈ పోస్టు....

౧)రచయిత అనేవాడు ఎల్లప్పుడు కళ్లజోడు పెట్టుకొని, తల దువ్వుకోకుండా ఉంటాడు.
ఏంటీ...మీకు కళ్లజోడు లేదా, రచయితలం కాలేమూ అంటారా! మరీ ఇలా డీలా పడిపోతే ఎలాగండీ. కావాలంటే అప్పుడప్పుడు రౌడిగారిలా దర్శనమివ్వండి. వీలుపడితే మా నేస్తం అక్క చెప్పినట్టు ఏసీ లో కూడా చలువ కళ్లద్దాలు వేసుకోండి.


౨) రచయిత దాదాపు ఎవరిమీదనో కోపంగానో లేకపోతే బాధపడుతూనో ఉంటాడు. ఏదన్నా మాట్లాడితే బాగా లోతుగా మాట్లాడతాడు. తను ఈమధ్యే ప్రచురించిన పుస్తకాన్ని ఏవగించుకుంటూనే తన తదుపరి పుస్తకం కోసం అమోఘమైన ఆలోచన ఉందని ఫీలవుతుంటాడు.


౩)సమాజం పట్ల తనకు ఓ మహత్తర బాధ్యత ఉన్నదని అది నెరవేర్చడం తన కర్తవ్యమనీ, ఈ నిజాన్ని తన తరం వారెవరూ గ్రహించలేరని, తనను అర్ధం చేసుకోలేరని అనుకుంటాడు. ఒకవేళ అర్ధం చేసుకుంటే తాను మేధావి అనిపించుకొవడం కుదరదనుకుంటాడు.


౪) మామూలు జనం మాట్లాడే భాషను రచయిత వాడడు. సగటు మనిషి ఓ 3000 పదాలు వాడితే రచయిత పదకోశం లోని మిగతా పదాలన్నీ వాడతాడు. ఎందుకంటే తాను సగటు మనిషికాదు.


౫)కేవలం ఇతర రచయితలే తనను అర్ధం చేసుకోగలరు అనుకొంటాడు. అనుకుంటునే మనసులో ఇతర రచయితలను ఏవగించుకుంటాడు,  most complicated book రాసిన రచయితగా పేరుతెచ్చుకొవడానికి పోటిగా ఉన్నారని.


౬) ఎవరినన్నా ఉలిక్కిపడేలా చేయలనుకున్నపుడు 'ఐన్‌స్టీన్ ఒక వెధవ' అనో 'టాల్‌స్టాయ్ ఓ బూర్జువా' అనొ అంటాడు.


౭) ఆడవాళ్లను ఇంప్రెస్ చేయడానికి తాను ఓ రచయితనని చెప్పి అక్కడికక్కడ కంటికి కనిపించిన ఓ కాగితం ముక్కమీదో, రుమాలు మీదో ఓ కవిత రాస్తాడు.


౮)తన మిత్రులదో, ఇతర కవుల/రచయితల పుస్తకాలకు సమీక్ష రాయాల్సొచ్చినపుడు "అసలీయనగారు పుస్తకం చదివారా లేదా?" అనే అనుమానం వచ్చేట్టుగా 'జీవితపు ద్వైదీభానల సమ్మేళనం' వంటి పెద్ద పెద్ద పద ప్రయోగాలు చేస్తాడు.


౯) తమరు ప్రస్తుతం ఏం చదువుతున్నారు అని అడిగినపుడు ఎవరూ పేరు కూడా వినుండని ఏదో పుస్తకం పెరు చెప్తాడు.





అలా పరిశోసధించేసి వాళ్లమ్మగారికి చెప్తాడు. దానికి ఆవిడేమంది, ఈయనేం చేసారనేది మీరే కనుక్కొండి. మందుమాటలో చెప్పాడు కాబట్టి brief గానే ఉంటుంది. మిగతా పుస్తకమంతా ఆయన వివిధ వార్తపత్రికలలో ప్రచురించిన కథలు, వ్యాసాల సంకలనం. Coelho రచనల్లో చాలామటుకు mysticism ఉంటుంది మానవ జన్మకు ఓ పరమార్ధం ఉందని, పుట్టిన ప్రతి మనిషి అది నెరవేర్చడానికి పునుకొవాలని అందుకు కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఇలాంటివాటిపై నమ్మకం ఉంది-లేదు అని పక్కనపెడితే కార్యసాధనకు కావాల్సిన బోలెడు విషయాలు ఆయన రచనల్లో వెతుకోవచ్చు.

ఖేల్ ఖతం దుక్నం బంద్

హ్మ్....రెండేళ్ల క్రితం తడబడుతూ భయపడుతూ మొదలైన పయనం, కనీసం నా అనుకోలులో, మూడు కెవ్వులు ఆరు కేకలు కొన్ని నిట్టూర్పులు హర్షాతిరేకాలతో గడచిన సమయం ఈరోజుతో ముగియబోతుంది.......................................It all comes to an end today

***************************************************************************
రెండుచేతుల్తో సామాన్లు పట్టుకొని స్టేషన్ బయటకు వచ్చా.. అక్కడనుండి క్యాంపస్‌కు టాక్స్లిలోనా ఆటోలోనా ఎలా వెళ్ళాలో ఆలోచిద్దామని. ఐతే అక్కడే  కాలేజ్ నుండి కొందరు విద్యార్దులు స్టేషన్‌లొ హెల్ప్ డెస్క్‌లాంటిది ఏర్పాటు చేసారు. అక్కడికక్కడే వచ్చినవారి వివరాలు తీసుకొని 'మీ కోసం బస్సు ఏర్పాటు చేసా'మని చెప్పారు. అదెక్కేసి దారి వెంబడి కనబడుతున్న ఎర్ర భవనాలు చూసి ఎంతైనా కమ్యునిస్టు కంట్రీ కదా అనుకున్నా (బెంగాల్ ఒక రాష్టం కదా కంట్రీ ఎంటి అని ఆ డౌటేంటి మీకు...ఎబ్బే అస్సలు బాలేదు tongue ). క్యాంపస్ చేరే మార్గంలో ఓ రైల్వే ట్రాక్‌వుంది, చుట్టుపక్కల కొన్ని పండ్ల బండ్లు కిరాణా షాపులు కనిపించాయి.... హ్మ్ టౌన్ బాగానేవుంది అనుకునేలోపే కాలేజ్‌లో ఎంటరయ్యాం అని ఎవరో అనడం వినిపించింది. ' ఆ...... రైల్వే ట్రాక్ పక్కనే కాలేజేంది !!' అనే అనుమానం చెబితే కాన్పూర్‌లో కూడా అంతే బాస్, పైగా మనదే బెటర్ ట్రాక్‌కు కొద్దిపాటి దూరంలోవుంది అని పక్కనున్నతను అన్నాడు. ఓహో అలాగా అనుకొని హాస్టల్‌కు చేరుకున్నా. అక్కడ కొంతమంది కొత్త స్నేహితులు కనిపించి స్వాగతం పలికారు. ఆ తరువాతరోజు  రిజిస్టేషన్ సెమినార్‌తో ప్రారంభమైన ఖరగ్‌పూర్ జీవితం మిగిల్చిన ఆనందాలు,నిరాశలు,అనుభూతులు అన్నీ ఇన్నీకాదు. నన్నునాకు కొత్తగా మరింతలోతుగా పరిచయం చేసారు ఇక్కడి స్నేహితులు. 
ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం, ఒక్కో ప్రాంతం, ఇంజనీరింగ్‌లోనివి ఉద్యోగ జీవితంలోనివి ఎన్నో అనుభవాలు. వెరసి ఒక encylopedia లోని విషయాలవంటి వైవిధ్య మనస్తత్వాలు. అటువంటివాళ్లతో గడిపిన కొన్ని క్షణాలు కొన్ని సంఘటనలు ఇక్కడ నెమరువేసుకుంటూ..........................

*) హరిప్రసాద్ చౌరాసియా గారి కచేరి:
నాకా సంగీత జ్ఞానం నిండు సున్నా....ఐనాకాని విశ్వనాథ్ వారివో, పాత సినిమాలో చూస్తున్నపుడో వాటిలో సాంప్రదాయ సంగీతం విన్నపుడు నాకు కూడా ఎంతోకొంత తెలుసనుకొని తెగ ఫీలయిపోయి పరవశించిపోతుంటా. అలాంటిది ఒక సాంకేతిక కళాశాలలో ఇలాంటి సాంప్రదాయ సంగీత కచేరి ఏర్పాటు చేస్తున్నారని తెలిసి, అందుకు ప్రవేశం *ఉచితం* అని తెలిసి ఉబ్బితబ్బిబ్బైయ్యాను. సంగీతపరంగా కచేరిని ఆస్వాదించడమేమోగాని అయన వేణునాదాన్ని అప్పుడపుడు ఆయన చెప్పిన సరదా మాటలు విని చాలా ఆశ్చర్యం వేసింది. అంత పెద్దాయన ఈ వయసులో ఇలా ఎలా ఉండగలుగుతున్నారని. మొత్తానికి కార్యక్రమం ఐపోయేపట్టికి నాలో ఒకింత గర్వం ఒక కచేరి విన్నానని.....happy

*) దీపావళి:
దీనిపై ఈ పాటికే ఓ టపా రాసాను, కాలేజిలో ఎలా సెలబ్రేట్ చేస్తారు అని. ఫొటొలో చూస్తే బాగుంటిగాని అంతబాగా మన కళ్ళరా దర్శనం చేస్కోవాలంటే మాత్రం దిమ్మతిరిగిబొమ్మ కనపడుతుంది. విషయం ఏంటంటే మట్టిదీపాలతో కళాకృతులు తయారుచేసాక ముందుగా వాటిని న్యాయనిర్ణేతలు చూస్తారు. పైకి-కిందకు ముందు-వెనకా ఎగాదిగా చూసేసి మార్కులు వేసుకొని వెళ్ళిపోతారు. చిన్నచిన్న కుందులతో అలంకరణ చేస్తాం కాబట్టి అవి ఎక్కువసేపు ఉండవు అందుకని ఇలా జడ్జిలు వెళ్తారోలేదొ అభిమాన నటుడి సినిమాకు మొదటిరోజు పోటెత్తినట్టు జనాలు ఒకరినొకరు తోస్కుంటూ నెట్టేస్కుంటు లోపలికొచ్చేస్తారు. ఇహ లేడీస్ హాస్టల్ దగ్గర సందడి గూరించి చెప్పక్కర్లేదు winkingbig grin. పే.....ద్ద కాంపిటీషన్ ఉంటుంది వాళ్ల హాస్టల్ గేట్ల దగ్గర. అలా సెక్యూరిటివాడు గేటు తెరవంగానే డ్యామ్ నుండి పొంగిపొర్లే వరదనీటిలా దూసుకెళ్ళిపోతారు.  బతికుంటే  బర్డ్‌వాచింగ్  చేసుకోవచ్చు అనుకునే నాబోటీవాళ్లు (ఇదొక సాపేక్ష సత్యం ) ఒరేయ్ రేపు ఎవడొ ఒకడు LAN లో share  చేస్తాడు అని చెప్పేసి తాపీగా Rangoli లాంటివి చూసేసి బయటపడి ఎవరి హాస్టల్ దగ్గర వాళ్ళు పఠాకులు కాల్చుకుంటాం.

*) సిక్కిం
మొదటి సెమిస్టరు అయ్యాక స్నేహితులు కొందరు ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ ఒకటి వెద్దాం అని ప్రతిపాదిస్తే ఇప్పుడు PG చేస్తూ ఎంతమంది వస్తారు ఇలాంటివాటికి అనుకున్నా. పట్టుమని నలుగురం కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయాం. ఆ తరువాత ఫిబ్రవరిలో మా క్లాస్మేట్, గురూజీ ( ఈయన అసలు పేరు అబనీశ్వర్, ఉపాధ్యాయుడు ఓ ముప్ఫై ఉంటాయ్.  మా క్లాస్‌లో అందరికి ఇష్టుడు అభిమానంగా గురూజీ అని పిలుచుకుంటాం) వెంటపడి వెంటపడి టూర్ ఫైనలైజ్ చేసాడు. ఇంజనీరింగ్‌లోనే కులూ-మనాలీ వెళ్ళాను, ఇప్పుడు మళ్ళా అంతగా ఎంజాయ్ చేయగలనా లేదా అనే అనుమానంతోనే నేనుకూడా బయల్దేరా. కాని ఒక్కసారి బెంగాళ్ సరిహద్దులు దాటుకుంటు సిక్కిం ప్రవేశించగానే నా అభిప్రాయం మొత్తం మారిపోయింది. కొండలు లోయల్తో, పచ్చని సోయగాలతో తనని తాను సింగారించుకున్న ప్రకృతికాంతను చూసి ఈ చదువులు ఉద్యోగాలు గట్రా అన్నీ వదిలేసి శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనిపించింది. అక్కడ గమనించిన ఆశ్చ్యర్యకరమైన విషయం ఆడవాళ్లే వ్యాపారలు, ఇంటిసంగతులు చుసుకోవడం.  టీకొట్టు దగ్గర్నుండి హోటళ్లు నడపడందాకా అన్నీ ఆడవాళ్లె చేస్తారట. మొగుడు అనేవాడు ముప్పూటలా తిని తొంగుంటాడు అంతే లేకపోతే టూరిస్టు బండ్లు అవీ గట్రా నడుపుతుంటాడు. మా గురూజిది ఈశాన్య భారతదేశం, ఆయన అప్పుడపుడు చెబుతుండేవాడు వాళ్ల దగ్గర 'కట్నం' అనేది ఉండదని, అడగితే పెళ్లికూతురు చెప్పిచ్చుకొని కొడుతుందని, తక్కిన భారతదేశంలో కట్నం తిసుకుంటారు అని తెలిసి ఆశ్చర్యపడ్డానని. ఏంటి ఇదంతా నిజమే అనుకున్నాగాని అక్కడ ఆడవాళ్ళు చేసే పనులు చూసి నిశ్చయించేసుకున్నా వీళ్లు చెప్పుతీసి కొట్టడంలో తప్పు లేదని.


ఎత్తైన హిమాలయాలు ఆ కొండల్లో మైదాన ప్రాంతాలు, ఊపిరాడటం కష్టంగా ఉన్న ఆ ప్రదేశాల్లో జవాన్లతో కొంచెం సమయం గడపటం, ఇండియాలో ఉన్నామా ఫారిన్‌లో ఉన్నామా అన్నట్టు ఉండే రాజధాని గ్యాంగ్‌టాక్ వీధులు, పసందైన మోమోలు సిక్కింలో గడిపిన ఆ ఏడెనిమిది రోజులు మాత్రం మరపురానివి. గురూజీ లేకపోయుంటే మా టూర్ ఒక ప్రతిపాదనగానే మిగిలిపోయేది.




*)


Yes....... తన పదవీకాలంలో భారతదేశపు అత్యంత ప్రీతిపాత్రుడైన రాష్టపతిగా పేరు తెచ్చుకున్న కలాం గారితోనూ ఒక అనుభవంవుంది. అసలు అలాంటి ఒక వ్యక్తిని కళ్ళారాచూసే అవకాశం వస్తుందని కలలోకూడా అనుకొని వుండను. క్రితం జనవరిలో ఐ.ఐ.టి ఖరగ్‌పూర్ ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రయోగం చేపట్టింది. విద్యార్దులు ఎక్కడినుండైనా తమ Lab experiments చేసుకోగలిగేలా online ప్రయోగశాలను  తయారుచేసింది. దాన్ని ప్రారంభించడానికి కలాంగారు వచ్చారు. ఆ సంధర్భంగా విద్యార్దులతో కాసేపు మాట్లాడతారని చెప్పారు. ముందుగా రిజష్టర్ చేసుకొన్నాం. తీరా ఆరోజు వచ్చేసరికి స్నేహితులు కొందరు దుప్పటి ముసుగేసుకొని పడుకొని ఉన్నారు. మామూలుగా ఐతే నేనుకూడా అలాగే పడుకునేవాడిని కాని ఆరోజు 'ఒరేయ్ వస్తావా' అని ప్రతొక్కడిని పిలిచి ఆఖరకు 'మీ చావు మీరు సావండెహె, నే పోతున్నా' అని చెప్పి వెళ్ళిపోయా. కార్యక్రమం జరిగే హాల్‌లో ఓ వందమందిమి ఉన్నాం. ఆయన గనక వస్తే ఆయనకు నాకు దూరం ఒక ఐదు ఫీట్లు ఉంటుందేమో.....చాల్రా దేవుడా అనుకున్నా. ఫ్రొఫెసరేమో 'ఆయన సమయం విలువైనది కాబట్టి మీలో కొందరికే ప్రశ్నలడిగే అవకాశం ఇస్తాం, అవి కూడా రాజకీయాలకు సంబంధించినవి కాకుండా చూస్కోండి అన్నారు'. ఆయనను చూడటామే ఎక్కువ ఇంకా ప్రశ్నలు అడగటంకూడానా అని మనసులోనే అనుకొని చెయ్యి మాత్రం పైకెత్తా. ప్చ్ లాభంలా.....ఓ పన్నెండుమంది దగ్గర చిటీలు తిసుకొని ఇకచాలు అన్నారు ప్రొఫెసర్. సర్లే అనుకొని కూర్చున్నా. కాసేపటికి ఆయన వచ్చారు. అంత ముదిమి వయసులోనూ ఆయన చలాకీతనం చూసి ముచ్చటేసింది. యథాప్రకారం మాతో ప్రతిజ్ఞలు
 చేయించుకొన్నాక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దాదాపు అందరిది ఐపోయింది. ప్రొఫెసరు మా వైపు కూర్చున్నవాళ్లలో  ప్రశ్న అడగబోయేవాళ్ళు అడగండి అన్నారు. సదరు క్యాండిడేట్లు స్పందించడంలేదు. ఇదే అవకాశం అనుకొని లేచి నిల్చున్నా. Yes......, i was about to talk to a prominent personality of India. సౌరవిద్యుత్తు-అణువిద్యుత్తు గురించి ఓ ప్రశ్న అడిగా దానికి ఆయన సమాధానం చెప్పారు. అంతే ఐపోయింది. కాని ఎందుకో ఈసారి కూడా ఒకింత గర్వం, ఆనందం...... happy

 *) క్యాంటిన్

రెండేళ్లపాటు క్లాసులకైనా సరిగా వెళ్ళుండంకాని ఏరోజుకూడా హాస్టల్ క్యాంటీన్ వెళ్లకుండా ఉన్నదిలేదు. ఐదు రూపాయలు దొరికే అల్లం ఛాయ్‌ను సాయంత్రం నుండి రాత్రివరకు నాలుగైదుసార్లు తాగిన రోజులు కూడా ఉన్నాయ్. మొదట్లో వింగ్‌లోని ఐదారుగురం కలిసి వెళ్లేవాళ్ళం....ఆ తరువాత నెమ్మదిగా ఆ సంఖ్య 14-18 కి చేరుకుంది. ఛాయ్ కోసం వచ్చామంటే క్యాంటీన్ దాదా (అన్న) డబ్బా గలగలలాడిపోయేది. ఈ మధ్యనే దాదా ఒక ఫ్రిజ్ కొన్నాడు. మా అనుమానం ( వెర్రి అనుమానమే అనుకోండి) మా బ్యాచ్ ఛాయ్ తాగిన డబ్బులతోనే దాన్ని కొనుంటాడేమో అని !!
ఈ క్యాంటీన్ చలవ వల్ల ఓ మహత్తరమైన వంటకానికి బానిసనైపోయాను. అదే మ్యాగి. అసలు మా క్యాంటిన్ వాడు చేసినట్టుగా ఇంకెవరు చేయరు అని డిసైడ్ అయ్యాను. నా ఈ బానిసత్వం ఎంత ముదురంటే ఛాయ్ కోసం వెళ్ళినపుడు స్నేహితులు నా ఆర్డర్ తీసుకోరన్నమాట. Default గా 'వీడికి మ్యాగి, ఛాయ్' అని అనేసుకుంటారు. నెను చెప్పాల్సిందల్లా ఆ మ్యాగిలో వెజ్ కావాలో నాన్ వెజ్ కావాలో చెప్పడం :D
కాలేజ్ బయట పూరి గేట్‍లో 'చేదీస్' అని ఒక చిన్న హొటెల్ వుంది. ఉదయం 4:30 కు తెరుస్తాడు. తెరచిన గంటవరకు  మటన్ మ్యాగి చేస్తాడు. అదైతే ఇక బ్రహ్మాండమనే చెప్పాలి. మీరెపుడైనా ఇటొస్తే మా హాస్టల్‌లోగాని, చేదీస్‌లో గాని మ్యాగి తినడం మరచిపోవద్దు.

*)బర్త్‌డే- ఒక భయంకరమైన డే....

ఎవరన్నా పుట్టినరోజులు జరుపుకోవాలంటే, అదీ స్నేహితుల సమక్షంలో జరుపుకుంటే ఆనందపడతారు. కాని యువరానర్ అది అన్నిసార్లు నిజంకాధ్యక్షా. ప్రత్యెకించి హాస్టల్‌లో ఉన్నప్పుడు. పుట్టినరోజు కొసమని రూమ్‌ను అందంగా అలంకరిస్తారు. కరెక్టుగా రాత్రి పన్నెండు గంటలకు కేక్ కట్ చేయిస్తారు. మొహానికి కొంచెం / లేకపోతే మొత్తం కేక్ రాసేస్తారు. ఆ తరువాత ఉంటది నా సామిరంగా.......పుట్టినరోజనికూడా  చూడకుండా సీట్ వాయించేస్తారు, బర్త్‌డే బాంబులు ఇస్తారు. ఆ ఎఫెక్టుకు కనీసం ఒకరోజు కూర్చోడానికి వీలుండదు. అంత పాశవికంగా దాడి చేసాకకూడా వదల్రు. ఆ అర్దరాత్రి వాళ్లను మేపాలి. బర్త్‌డేబాయ్ బేబీది జేబులు ఖాళీ అవాలి. ఇది కేవలం అల్పాహారం లాంటిది. ఇది కాకుండా ధాభాకు ఎక్కువ రెస్టారెంటుకు తక్కువ అన్నట్టుండే మా ఖరగ్‌పూర్ రెస్టారెంట్లలో పార్టి ఇవ్వాలి. ఈ రెండేళ్లలో రెండుసార్లు సీటు వాచిపోయింది. ఎన్నిసార్లు వాయగొట్టడంలో పాలుపంచుకున్నానో సారి...., గుర్తులేదు.

ఇవికాక వేడువేడి చర్చలు, వాదాలు, అందరం కలిసి సినిమాలు చూడటం. సినిమా చూడడానికి కష్టాలు పడటం. ఎన్నో మరెన్నో.....ఇవన్నీ నేటితో ముగిసిపోతున్నాయి. జ్ఞాపకాలుగా మిగిలిపోబొతున్నాయ్........
ఇంటికెళ్ళాక ఇవేమి ఉండవు. క్యాంటిన్ ఛాయ్ ఉండదు, మ్యాగీ ఉండదు......సొల్లు కబుర్లు చెప్పుకోడానికి జనాలుండరు. యే ఖేల్ ఖతం హోగయా హై.

హ్మ్............... కొంచెం సిరియస్గా సాగదీసినట్టూన్నా.....

ఐతే బ్లాగు సుజనులారా, ఈరోజు నేను ఇంటికి బయల్దేరుతున్నా కాబట్టి దార్లో మీ అభిమానం కొద్దీ ఏదో ఒకటి నాకు సమర్పించేసుకోండి. ఇజీనారం వాళ్ళు పూతరేకులు, విజయవాడ వాళ్ళు బిర్యాణి-పలావు, రాజమండ్రి వాళ్ళు బోండాలు, గుంటురువాళ్లు గుంటురు బాంబులు (మిర్చీ బజ్జీలు స్వామి) హైదరాబాదు బ్లాగర్లు నా రాకను పురస్కరించుకొని ఘనంగా స్వాగతాలు సమర్పించేసుకోండి. మీ గూరించి ఎక్కడెక్కడో red inkతో రాసేసి blue ink తో underline చేస్తా.

చెత్త పోస్టు, సుత్తి పోస్టు - పని లేకపోతేనే చదవండి

మళ్ళి చెబుతున్నా.... రివ్యూనో, పక్కవాడిలో గమనించిన విషయాలో చెప్పను. పూర్తిగా చెత్తపోస్టు ఇది. టైం బ్యాడ్‌గా ఉంది అనుకుంటేనే చదవండి.....

చదువుదామంటే...
--కామెడి పోస్టులు నవ్వు తెప్పించడంలేదు, [ తోటరాముడి బ్లాగు కూడా నవ్వించలేక పోయింది ]
--సీరియస్ పోస్టులు బాధను/సానుభూతి భావనను కలిగించడంలేదు.
--కెలుకుడు  పోస్టులు ఆసక్తి కలిగించడంలేదు.
something is terribly wrong with me, i guess.

ఈ-మెయిలు చెక్ చేస్తూ ఓ ఫ్రెండ్ పంపించిన మెయిల్ చూసా...

ఓ చిన్నపాప [మూడు వారాల వయసు ఉండొచ్చు] ఫొటో, ఆ పాపకు ఏదో భయంకరమైన జబ్బంట, పాప తల్లిదండ్రుల దగ్గర డబ్బుల్లేవంట. ఈ సమయంలో ఓ తొక్కలో ఈ-మెయిల్ కంపెనీగాడు పాప ఫొటోతో ఉన్న మెయిల్ ను ఎంతమంది ఎన్నిసార్లు ఇతరులకు చేరవేస్తారో అన్ని రూపాయలు/సెంట్లు/యెన్‌లు, నా బొంద, ఆ పాప తల్లిదండ్రులకు ఇస్తారంట. ప్లీ..........జ్ మీకు హృదయం అనేది ఏడిస్తే ఫార్వర్డ్ చేయండి అని రాసుంది.
చదవంగానే మెయిలు పంపించిన ఫ్రెండును గూబమీద ఒక్కటి పీకాలనిపించింది. ఈ దరిద్రపు ప్రపంచంలో ఈ-మెయిలు ఇంకొకళ్లకు పంపించినదానికే డబ్బులిచ్చే తలకుమాసిన వెధవెవడైనా ఉంటాడా......ఇట్టాంటి మెసేజీలు వేరేవాళ్లకు పంపించేపుడు కాసేపైనా ఆలొచించొచ్చుగా.......ఊహూ అక్కడకు ఈళ్లొక్కల్లే హృదయం ద్రవించిపోయిన మనుషులు. ఏవన్నా అంటేనేమో 'ఏమో, నిజంగానే పాపకు జబ్బు తగ్గడానికి డబ్బులు ఇస్తారేమోననే ఆశ/నమ్మకం' అంటారు.  To hell with your sentiments అని అరవాలనిపిస్తుంది. చేతకాక....చేయలేక ఇవి అబద్దం అని చెప్పే అంతర్జాల లింకు ఒకటి పంపించినోడి మొహం మీద పడేస్తాను.

ఈ పోస్టును ఇంకా ఎవరైనా చదువుతుంటే వాళ్లకు ఒక విజ్ఞప్తి....
అమ్మలారా/అయ్యలారా... మీరు ఈ-మెయిల్లు ఫార్వార్డ్ చేసినంత మాత్రాన ఎవడూ ఎవడికి డబ్బులియ్యరు. తలకుమాసిన సన్నాసులు కొందరు మానవ సహజమైన భావోద్వేగాలతో అడుకునే పరమచెత్త చేష్ట అది. మీకు అలాంటివి తగిలినపుడు హృదయం ద్రవించిపోయి వేరేవాళ్లకు పంపిస్తే ఆ వికృత పాచికలో మీరు భాగస్వాములు అయినట్టే.

ప్రస్తుతం నేనుకూడా అలాంటి పనే చేసాను. నాకు ఎటూ పాలుపోక మీ సమయాన్ని వృధా చేయడానికి ఈ పొస్టు రాసాను . చూడబోతే psycho లక్షణాలు ఎక్కువౌతున్నాయి ఏంటో లేకపోతే హిట్స్ పెంచుకోవడానికి తప్ప ఉపయోగపడిని నా ఈ పోస్టెందుకో.... . పాఠకులకు వీలైతే మన్నించండి లేకపోతే మీ భావావేశాలను వెళ్లగక్కండి....కామెంటు బాక్సు మీకోసమే పడుంది

రామదండు విజయం....

దేవుడి సొంత మైదానంలో హోరా హోరిగా యుద్దం జరిగింది....
దేవుడి ప్రాభవం కోసం
రాజు కదలిరాగా, సైనికులు తోడురాగా, దేశ ప్రజలు ఆశీర్వదించగా...

ఒక్కొక్కరుగా, కలిసికట్టుగా పోరాడి సాధించుకున్నారు
'విశ్వ విజేత' బిరుదు తెచ్చుకున్నారు.

రెండు దశాబ్దాలుగా దేశంలో ఆటను చల్లగా చూసినందుకు
యుద్దం తరువాత దేవుడికి యుద్దభూమిలో బ్రహ్మోత్సవం జరిగింది
చూడ్డానికి రెండు కన్నులు చాలనంతగా...








దేవుడి తరువాత రాజ్యంలో ఇక స్పూర్తి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికిన క్షణం....
దేవుడి కిరీటంలో మరో కలికితురాయి, రాజ్యానికి తలమానికం
I am Happy

I am ecstatic...
I am burst with joy

I am insane at this moment...

This goes out to all the people of India. This is my first World Cup; I can't ask for more. Tendulkar has carried the burden of nation for 21 years; It was time we carried him. Chak de India!"
Virat Kohli leads the Tendulkar tributes

All credit goes to Sachin Tendulkar. We played for him. Beating Australia and Pakistan and now this, its a dream come true."
Gautam Gambhir, who gave India the upper hand in the final with his 97


I couldn't have asked for anything more than this. Winning the World Cup is the proudest moment of my life. Thanks to my team-mates. Without them, nothing would have happened. I couldn't control my tears of joy."
Sachin Tendulkar, who's played six World Cups, on his best moment

This is unbelievable. The Under-19 World Cup, then the World Twenty20 but this is the most special. For Sachin, for everyone else."
Yuvraj Singh, the Player of the Tournament, sums it up

YOOOOOO INDIAAAAAAAAAAAAAAAAAAA


[ఫుటోలు www.espncricinfo.com నుండి తీసుకోబడ్డాయి..., hope they don't mind it :)  ]

సృష్టిరచన దిశగా ఆధునిక విశ్వామిత్రుడు

జీవపరిణామ క్రమంలో మనిషి అవతరించాక అతనికి తన ఉనికి తెలిసినప్పటినుండి ఆ ఉనికి కారణమేంటో అన్వేషించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో తనకుతాను వేసుకున్న ఒక్కో ప్రశ్నకు అవాంతరాలను అధిగమిస్తూ జవాబు వెతుక్కుంటూవున్నాడు. ప్రస్తుతం ఆధునిక మానవుడికి అంతుచిక్కకుండావున్న రెండు ముఖ్యమైన ప్రశ్నలు స్థూలంగా...

1. విశ్వం ఆవిర్భావానికి కారణమైన బ్రహ్మ పదార్ధం ఎక్కడినుండి వచ్చింది ? అది ఎందుకు విస్ఫోటనం చెందింది ?

2. జీవం అనే సంక్లిష్టమైన స్థితికి  కారణం అలౌకికమా లేక కేవలం రసాయనిక చర్యలేనా ?

ఈ రెండు ప్రశ్నలకు సమాధానాల కోసం తరాలుగా ఎడతెరిపిలేని ప్రయత్నం జరుగుతుంది.  ఇటీవల జరిగిన పరిశోధనల ఫలితంగా శాస్త్రవేత్తలు పైన చెప్పిన రెండవ ప్రశ్నకు సమాధానం రాబట్టి తద్వారా  జీవం ఆవిర్భావానికి తోడ్పడిన కారణాలను విశ్లేషిస్తున్నారు.

అమెరికన్ బయాలాజిస్టు జే.క్రెయిగ్ వెంటర్ తమ పరిశోధనలలో భాగంగా బాక్టీరియా కణంలోకి పరిశోధనాశాలలో రూపొందించిన కృత్రిమ జీనోమ్‌ ను ప్రవేశపెట్టి ఆ కణాన్ని విజయవంతంగా పని చేయించగలిగారు. పరిశోధన ఫలితాలు విశ్లేశించేముందు అసలు ఈ  కణాలు, జీనోమ్ అంటే ఏంటొ ఒకసారి చూద్దాం.

ఒక ఇంటిని నిర్మించడానికి ఇటుకలను ఎలాగైతే పేర్చుతామో అలాగే ప్రతి జీవి శరీరము కణాలు అనే ఇటుకలతో నిర్మించబడుతుంది. మానవ శరీరం కోట్లాది కణాలతో శరీరములోని ఒక్కో భాగము ఒక్కో విధమైన కణాలతో నిర్మితమైవుంటుంది. ఇటుకలకు ఎలాగైతే రంగు, ధృఢత్వం లాంటి లక్షణాలుంటాయో కణానికి కూడా అలాంటి లక్షణలుంటాయి - ఆ కణము చేసే పని ఏంటి అని. కణంలోని జీనోమ్ కణం పనితీరుని నియంత్రిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఆహారం నుండి శక్తి ఉత్పాదన, ప్రత్యుప్పత్తికి ఇతర జీవక్రియలకు కావలసిన జీవరసాలను తయారుచేసేవి కణాలైతే యే యే కణాలు ఏ పని చేయాలో నిర్దేశించేవి వాటిలోని జీనోమ్ అన్నమాట. మనం అప్పుడప్పుడు DNA అని వింటూ ఉంటాం కదా ఈ జీనోమ్ ఆ DNA అనే కార్బన మూలకానికి సంబంధించినదే.

చిత్రంలో ఎరుపు రంగుతో గుర్తించిన ప్రాంతంలో శక్తి ఉత్పాదన జరుగుతుంది, నీలం రంగుతో గుర్తించబడ్డ ప్రాంతంలో (Nucleus - కణ కేంద్రకం ) DNA వుంటుంది.

ఇప్పుడు విషయానికి వస్తే సదరు శాస్త్రవేత్తలు చేసిందేమిటంటే ప్రయోగశాలలో కృత్రిమంగా తయారుచేసిన జీనోమ్‌ను కణంలో ప్రవేశపెట్టారు. కృత్రిమ  జీనోమ్ ప్రవేశపెట్టినప్పటికి కణం యథాలాగనే పనిచేసింది. కాని ఇక్కడ జీనోమ్ ఒక్కటే కృత్రిమం......తక్కిన కణభాగాలన్నీ బ్యాక్టీరియాలోనే వున్నాయి కాబట్టి దీనిని మనిషి చేసిన 'జీవం' అనలేము. అయితే ఈ  ప్రయోగాన్ని అనుసరించి మరొక శాస్త్రవేత్తల బృందం మొత్తంగా ఒక కృత్రిమ కణాన్నే రూపొందించేందుకు పూనుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు  cell membrane ( కణం యొక్క గోడ) ను తయారు చేయగలిగారు. మిగతా కణభాగాలను అభివృద్ది చేయడానికి ఇంకా కొన్నాళ్ళు పట్టవచ్చు. అటు తరువాత జీనోమ్‌ను ప్రవేశపెట్టి కణానికి ప్రాణం పోయగలగడం లాంఛనమే........

కృత్రిమ కణాన్ని సృష్టిస్తున్నాం మరైతే మనుషులను తక్కిన జీవులను కృత్రిమంగా తయారు చేయవచ్చా ? అనే సందేహం వస్తుంది కదూ.....దానికి సమాధానం 'చేయవచ్చు కాని అనుకున్నంత సులువుకాదు'. ఎందుకంటే ప్రస్తుతం మన కంటికి కనిపించే, చాలావరకు కంటికి కనపడని ప్రాణుల్లో కోట్లాది కణాలుంటాయి. ఒక్కో కణానిది ఒక్కో ప్రత్యేకత పైగా వాటి మధ్య సమన్వయం వుంటుంది. ప్రస్తుత ప్రయోగాలను అనుసరించి అంత సంక్లిష్టత సాధించడం కష్టంతో కూడుకున్నది......మన సమీప భవిష్యత్తులో కుదరకపోవచ్చు.

అయితే........కొన్ని సూక్ష్మక్రిములు వుంటాయి వాటి శరీరంలో ఒకే ఒక కణం వుంటుంది. ఈ ప్రయోగాల ద్వారా అటువంటి ఏకకణ ప్రాణిని  సృష్టించినా చాలు తరాలుగా మనిషిని సమాధానం దొరకని ప్రశ్నకు తెరదించడనికి......తద్వారా 'దేవుడు' అనే భావనను అర్ధం చేసుకోవడానికి. ఆరోజు అసాధ్యం మాత్రం కాదు.

పోస్టులోని చెప్పిన ప్రయోగాల విషయం ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ నొక్కండి

ఆర్టికల్ courtesy : FB link by a friend

బులుసు సుబ్రహ్మణ్యం గారు తన ఈ-మెయిల్‌లో సూచించిన మరికొన్ని ఆర్టికల్స్

Dr. Venter తో BBC వారి ఇంటర్వ్యూ
ది టెలిగ్రాఫ్‌లో ని ఆర్టికల్
నేచర్ న్యూస్‌ వారి ఆర్టికల్

మనసుమాట

పసికందును లాలిస్తున్న
అమ్మ చెబుతుంది విను
మమత ఎంత నిష్కల్మషమో

నిలువెల్లా సోయగంతో అలరారే
ప్రకృతి  చెబుతుంది విను
ప్రాణమెంత అమూల్యమో

కవనము చేసే కవి కలం చెబుతుంది విను
తననుంచి జాలువారే అక్షరమెంతటి సమ్మోహనమో

ఎడబాటుతో రగిలే ప్రియుడి
విరహం చెబుతుంది విను
నెచ్చెలి అధరమెంత మధురమో


నిను కొలువుచేసుకొని ఆరాధించే
నామది చెబుతుంది విను
తనకు నువెంత అపురూపమో


రొబో! రొబో! ఈ సినిమా చాలా ఖరీదు గురూ...

ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ రియల్ లైఫ్ కామెడి ట్రాజెడి థ్రిల్లర్ మూవి. మీకు ఇలాంటి సినిమాలు నచ్చకపోతే  మీ  బ్యాడ్‌ లక్  నేనేమి చేయలేను.

అవి మేము పవర్ పులిని చూసి వాతలు పెట్టించుకున్న రోజులు. అందుకు ఎలాగైనా పగ ప్రతీకారం తిర్చుకోవాలని, పోగొట్టుకున్నచోటే వెతుక్కొవాలని తహతహలాడిపోతున్న రోజులు. సరిగ్గా అదే సమయంలో ఒకానొక రోజు తలైవార్ రజిని సినిమా వస్తుందని తెలిసి మంచి ఛాన్స్ వచ్చిందని మా ఫ్రెండ్స్ దగ్గర డిస్కషన్ మొదలుపెట్టా..
 "గుడ్, మంచి ఛాన్స్‌ఇది. దీన్ని వదలొద్దు. నువ్వు టికెట్లు బుక్ చెయ్యి. మిగతా స్కెచ్చు తర్వాత రాద్దాం" అన్నారు.
ఏంటి మనందరికి నేను బుక్ చెయ్యాలా....ఎప్పటికైనా  reimbursement అవ్వుద్దారా  అని దీనంగా మొహం పెట్టి నివేదించుకున్నా. ఆ పాషాణ హృదయాలు కరగకపోవడంతోతప్పక  నాతోపటు  ఆరుగురికి బుక్ చేయాల్సొచ్చింది. సినిమా చూడాల్సిన రోజు వచ్చింది.  సైన్యం 14 మందిని  పోగేసుకొని కాలెజ్ నుండి  టాక్సీలో స్టేషన్ చేరుకున్నాం. హౌరాకు ఎక్స్‌ప్రెస్ టికెట్లు తీసుకొని ట్రైన్ కొసం ఎదురు చూస్తున్నాం.
అరగంటైంది ఒక్క ట్రైను రాలా.....
గంటైంది...ఒక్క ఎక్స‌ప్రెస్   ట్రైను రాలా. వచ్చిన లోక్‌ల్ ట్రైన్‌లను మావాళ్లు వదిలేస్తున్నారు మూడు గంటలు అందులో గడపడం ఇష్టం లేక. అసలే చలికాలం కావడంతో ఎండకు ఒళ్లు చివుకు చివుకుమంటుంది. పైగా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఒరేయ్  ఇలాగైతే మనం శుభం కార్దు పడే సమయానికి చేరుకుంటామేమోరా...ఎదో ఒక ట్రైను ఎక్కేసి తొందరగా పోదాంరా అన్నాను.
"ఆగు బే...హడావిడి చేస్తావెందుకు. ఎళ్లగానే మనకు రెడ్ కార్పెట్టెసి వెల్కం ఏం చెప్పరు. ఐనా  వెళ్లేది ఫస్ట్ షో కు కదా...కాసేపాగ" న్నాడు బాక్స్ సంతోష్‌గాడు. నోర్మూసుకొని ఉండిపోయాన్నేను. ఇంకో అరగంట అయ్యాక మమ్మల్ని ఉద్దరించడాని అన్నట్లు ఎక్స్‌ప్రెస్ రైలొకటి వచ్చింది. ఖరగ్‌పుర్ నుండి హౌరా మధ్యలో అది ఒక్కసారే ఆగుతుంది... పైగా హౌరా ఆఖరు స్టేష‌న్ కాబట్టి స్లీపర్లో సీట్లు చాలామటుకు ఖాళీగా ఉన్నాయి  సభాశ్ అనుకొని ఎక్కడానికి నిశ్చయించుకున్నాం. అసలే తీసుకున్నది జనర‌ల్ టికెట్లు, అందరం ఒకే బోగీలో ఎక్కితే ఏదైనా ప్రాబ్లం అవుతుందని మేము నాలుగు గ్రూపులుగా (G1, G2, G3, G4 అనుకోండి) విడిపోయి మూడు బోగీల్లో(B1, B2, B3 అనుకోండి) ఎక్కాం. నేను నాతో ఇంకో ముగ్గురు ( G2)  కలిసి  ఒక బోగీలో(B2) ఉన్నాం. సీట్లు ఖాళీగా ఉండడంతో ముగ్గరం RAC సీట్లో ఇంకొకడు పక్కన లోయర్ బెర్తు సీటులో సెటిలయ్యాం. రైలు కదిలింది...సుమారు గంటన్నర తరువాత అది ఆగాల్సిన స్టాపుకూడా దాటేసింది, ఇక ప్రాబ్లం ఏమి ఉండదనుకొని సొల్లు కబుర్లేవో చెప్పుకుంటున్నాం.

అంతలో మావాడొకడు "అరె మన B1 బోగీలోవున్న నలుగురు G1 గాళ్లు ఏంచేస్తున్నారో చూసొస్తా"నన్నాడు. కాసేపయ్యాక వాడు పరిగెత్తుకుంటా వచ్చి " ఏ...వాళ్లను స్క్వాడ్ పట్టుకున్నాడు. బాబులు ఫైన్ కడుతున్నార"న్నాడు. Waste fellows అనుకొని శంకర్ గురించి, ఐశ్వర్యారాయ్ గురించి etc etc గురించి మా కబుర్లలో మళ్లా మునిగిపోయాం. కాసేపటికి స్క్వాడ్ మా బోగీలొ కనిపించింది. ఎలాగైనా ఫైన్ తప్పించుకోవాలని ఇంటెలిజంట్‌గా ఆలోచించి ఒక బ్రిలియంట్ ప్లాన్ వేసాం. మా నలుగురిలో ఒకడు పక్కన ఉన్న లోయర్ బెర్తులో, ఒకడు అప్ప్ర్‌ర్ బెర్తులో నిద్రపోతున్నట్టు జీవించాలని, మిగతా ఇద్దరు కూర్చున్న RAC సీట్లోనే రిజర్వేషన్ చేయించుకున్న వాళ్లలా కటింగ్ ఇచ్చుకుంటూ సెటిల్ అవ్వాలని ప్లాన్. నేనూ మా  రాహుల్‌గాడు RAC సీట్లో కూర్చుండిపోయాం రజినిని మించి నటిస్తూ.  ముగ్గురు స్క్వాడ్స్ ఒక్కొక్కరు మా సీటు దాటుకొని వెళ్ళారు ఒక్కరుకూడా మమ్మల్ని ఏమి అడగలేదు. బ్రిలియంట్ ప్లాన్ వండర్‌ఫుల్‌గా పని చేసిందనుకొని పొంగిపోతున్నాన్నేను....హ్మ్ నాకెంతెలుసు in front crocodile festival అని. అందరికన్నా ఆఖరునవున్న స్క్వాడ్ దగరకొచ్చి 'టికెట్ ప్లీజ్' అన్నాడు. ఇంకేముంది ఖేల్ ఖతం. జేబులో ఉన్న జనరల్ టికెట్టు తీసి చూపించా.
"ఇది జనరల్ టికెట్, స్లీపర్‌లో చెల్లద"న్నాడు
"అంటే..సీట్స్ ఖాళిగా ఉన్నయని ఎక్కాం"
"అలా కుదరదు....ఫైన్ కట్టండి" . " అవునూ టికెట్ నలుగురికి తీసుకున్నావుగా మిగతా ముగ్గురేరి"  అని తన మిగతా స్క్వాడు మిత్రులని పిలుస్తూ అన్నాడు.
యాక్టింగ్‌లో  జీవిస్తున్న ముగ్గురిని తట్టిలేపి స్క్వాడ్‌కు చూపించాను. నలుగురికి ఫైన్ రాస్తున్నారు స్క్వాడ్.
"ఎంత?" ప్లాపయిన సినిమా ప్రొడ్యూసర్ మొహం పెట్టుకొని అడిగాను.
"330"
"ఒహ్..నలుగురికి కలిపి అంతేనా....చాలా చీప్ అయ్యాయి ట్రైన్ జర్నీలు" మా ఫ్రెండ్‌తో అన్నాను.
"ఒక్కొక్కరికి 330 " ఆ గుంపులో ఉన్న ఒకానొక తెలుగు స్క్వాడ్‌ నుండి రిప్లై...

!@#(*%&((%#

"సార్...కొంచెం తగ్గించండి...అసలే స్టూడెంట్స్‌ మేము" దీనంగా వేడుకున్నాం.
"నథింగ్ డూయింగ్" అని వాళ్లు చలాన్లను బరబరా బరికేస్తున్నారు. నలుగురమూ ఆ ఫైన్ కట్టేసి ఎదవ టైమింగ్ అనుకొని సెటిలయ్యాం.
"శంకర్ ఈ సినిమా కోసం 160 కోట్లు ఖర్చు పెట్టించాడు...మనం ఆఫ్ట్రాల్ 330 పెట్టలేమారా" బాక్స్ సంతోష్ గాడు సెలవిచ్చాడు. ఆ పాయింటు నాకు financialగా సరిగా అనిపించకపోయినా  logicalగా బావుందనిపించి ఊరుకున్నా.
తాయిలం సమర్పించుకున్నాక G1 గ్రూపు నుండి అనిల్‌గాడు  వచ్చి " ఏరా పర్సులు ఖాళి చేయించుకున్నారా" అని ఒకటైపు చులకనగా ప్రశ్నించాడు.
"లేదురా... మీరు ఫైన్ కట్టడం చూసి మేము ఒక బ్రిలియంట్ ఐడియా వేసి తప్పించుకున్నాం" అని ఈసారి ఇంకెక్కువ జీవించేసి చెప్పాం వాడికి.
"బొంగేం కాదు...మీరు డబ్బులు కడుతుంటే నేను డొర్ దగ్గర నిలుచొని చూస్తూనేవున్నా"
ఆ మాటకు గాలి తీసేసిన ట్యూబులా చల్లబడి మీరెంత కట్టార్రా అని ఆరా తీసాం. ఈసారి వాడు గాలి తీసిన టైరు మొహం పెట్టి " ఫైన్ కట్టండి అన్నప్పుడు డబ్బులు లేవని చెప్పామురా...వాళ్లు మా పర్సులు తీసుకొని అందులో నొట్లన్నీ బయటకు తీసుకొని వాళ్ల చలానా రాసుకొని మిగిలిన 400 తిరిగిచ్చారు. దరిద్రం ఏంటంటే  వాడు రాకముందు మా దగ్గర 1800 ఉన్నాయో 2000 ఉన్నాయో తెలిసి చావట్లేద"ని ఒక మాదిరి వైరాగ్యపు నవ్వుతో అన్నాడు.

ఈలోపు మా రాహుల్ గాడు B3 బోగీకి వెళ్ళి కొత్త ఇన్‌ఫర్మేషన్‌ మోసుకొచ్చాడు. ఏం జరిగిందిరా అని అడిగితే.." హైలైటమ్మా... G3, G4 (ఈ గ్రూపులో ఇద్దరే ఉన్నారు) ఒకే బోగీలో ఎక్కారు ఒకరు ఈ చివర ఇంకొకళ్ళు అటు చివర కూర్చున్నారు. G3కు మనకులాగే  బొక్క పడింది."
"మరి G4 అయినా సేఫా" ఆత్రంగా అడిగాము.
"ఆళ్లదే ట్విస్టు. వీళ్ళిద్దరు అక్కడ లోయర్ బెర్తులో కూర్చుంటే కరెక్టుగా స్క్వాడ్స్ అందరూ వాళ్ల ఎదురు బెర్తులో రెస్టు తీసుకోవడానికి కూర్చున్నారంట. మనోళ్లు గుమ్మడికాయ దొంగల తరహాలో ఉండటం చూసి వాళ్లక కూడా కోటింగ్ ఇచ్చారు" ఒకింత గర్వంగా చెప్పాడు. ఆ మాట విని ఒకటే నవ్వు.

రైలు హౌరా వచ్చింది. నాలుగు గ్రూపులు ప్లాట్‌ఫాం పై చేరుకొని ఒకళ్ల మొహాలు ఒకరం చూసుకొని 14 మందిమి  అందరం ఏకరీతిన పట్టుబడ్డందుకు (  తుచ్చమైన ఈ ప్రపంచములో దాని పరిభాషలో చెప్పాలంటే వెధవలమైనందుకు )  ఈఈ అని నవ్వుకున్నాం. (స్వగతం: హుం ఇంకా నయం అంతకు ముందురోజు స్నేహితులు ఇంకొందరు ఇదే ట్రైనులో వెళ్ళి ఇలాగే పట్టుబడి మమ్మల్ని ఈ ట్రైను ఎక్కొద్దని చెప్పారని చెప్పానుకాదు). స్టేషను బయటకొచ్చి టాక్సీలు మాట్లాడుకొని సుమారు గంట ప్రయాణం తరువాత సరదు మల్టీప్లెక్స్ ఉన్న మాల్‌కు బయల్దేరాము. థియేటర్ చేరగానే గుర్తొచ్చిందేటంటే పొద్దటినుండి అసలే తినలేదని. మాల్‌లో KFC కనపడగానే అరికాళ్లలో ఉన్న ప్రాణం లేచొచ్చింది. ఇంకేముంది అందరం ఛలో KFC. 
లోపలికెళ్ళాక  ఎవడిక్కావాల్సింది వాడు ఆర్డరిస్తున్నాడు. నాది + నా G2 స్నేహితుల ఆర్డర్ చెప్పడానికి క్యూలో వెయిట్ చేస్తున్నా. పక్క క్యూలో వెరే గ్రూపు మెంబరొకడు " మామా నా కార్డు swipe చేస్తే బిల్లింగ్ అవడంలేదురా...నీ కార్డ్ ఇస్తావా. కాలేజ్‌కెళ్ళాక సెటిల్ చేస్తా"నన్నాడు. ఇప్పుడున్న బొక్కలకు తోడు ఇదొక బొక్కనాకు, వీడెప్పుడు సెటిల్ చేసేనో అని మనసులో అనుకొని " sure మామా నీకన్నా ఎక్కువనారా" అని నవ్వుతూ వాడికి కార్డిచ్చాను. Brunch (breakfast + lunch = brunch ) చేసాక  కౌంటర్లో  టికెట్లు తీసుకొని థియటలోకి వెళ్లాం.

ఇప్పుడోక చిన్న ఇంటర్వెల్....ఈలోపు మీరు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ గట్రా పుచ్చుకొనిరండి. నేను వెయిట్ చేస్తూవుంటా..

**********************************************************************************


అందరం సీట్లలో సెటిలయ్యాం.  హాల్‌లో లైట్లార్పేసారు. రొటీన్ ప్రకటనలు ఐపోయాయి. సినిమా సర్టిఫికెటు డిస్ప్లే అయింది. ధియేటర్లో ఒకటే ఈలలు. గోల గోలగావుంది. టైటిల్లు పడుతున్నాయ్. ఈలలు ఇంకా ఎక్కువయ్యాయి. RAJINI అని  ఒక్కొక్కటే అక్షరాలు పడుతుంటే మాకు థియేటర్లో సౌండ్ సిస్టం  బాలేదనిపిచ్చింది. అదే మన APలో ఐతేనా.. సినిమా టైటిల్ పడుతుంటే DTS హోరులో  హాలు దడదడలాడిపోయేది. ఏం చేస్తాం రజిని సినిమాకు కూడా కాలం కలిసి రాలేదని బాధపడిపోయి సినిమా అలాగే చూసేసాం.


సినిమా అయిపోయింది. మాల్ బయటకు వచ్చాం. చుట్టుపక్కన ఎక్కడా ఆటొలు టాక్సీలు గట్రా కనిపించలా. అక్కడేవున్న సెక్యూరిటీని అడిగితే అది సిటి outskirts కాబట్టి అంత రాత్రిపూట ఆటొలు టాక్సీలు ఉండవన్నాడు. మరెలా అని అనుకుంటుండగా ఓ పది నిముషాలు నడుచుకుంటా వెళ్తే అక్కడ చౌరస్తా వస్తుంది. అక్కడినుండి టాక్స్లీ/ఆటో దొరకొచ్చని సెలవిచ్చాడు. మా ప్రాప్తాన్ని తిట్టుకోడన్నిక్కూడా ఓపికలేక అలా నడుచుకుంటూ  వెళ్తున్నాం. పదినిముషాలు అలా నడుస్తూనేవున్నా  కూడలి ఏదీ కనిపించలేదు. దారిన పోయేవాళ్లని ఒకరిని అడిగితే ఇంకో పది నిముషాలు నడవండి వస్తుంది అన్నారు. అప్పుడు చూడాలి మా స్థితి. (ఇక్కడ డైలాగులేమన్నా expect చేస్తున్నారా ? భలేవారే...ఇంత ట్రాజెడిలో కూడా డైలాగులెందుకు సార్/మేడమ్ ). మొత్తానికి అలా నడిచాక  చౌరస్తా చేరుకొని ఒక అరగంటపాటు దొరికిన ఆటోలను టాక్సీలను వాళ్లు ’మేం రాము’ అంటున్నా ’దాదా చలో, దాదా ఆవో’ అని అడుగుతూనేవున్నాం. చివరకు దయగల ఒక దాదా మా వేడుకోలుకు జాలిపడి ఇంకొక ఆటొను పిలిచి మమ్మల్నందరిని హౌరా చేర్చాడు. అక్కడనుండ ఖరగ్‌పూర్ స్టేషన్, స్టేషన్ నుండి  కాలేజ్ చేరుకునే  సరికి అర్దరాత్రి మూడు అయింది మరియూ  ఒక్కొక్కడికి కేవలం కేవలం రూ. 1000 ఖర్చయింది. ఒకరికొకరం  ’గుడ్‌నైట్’ ’గాడిద గుడ్డు’ చెప్పుకొని మంచం మీద వాలిపోయాం.


మర్నాడు ఉదయం లంచ్ దగ్గర అందరం కూడుకొని గతదినం తాలుకు తీపి సంఘటనలను నెమరు వేసుకుంటున్నాం. అంతలో నిన్న మాతోపాటు రాని నరేష్‌గాడు వచ్చాడు. "ఏరా సినిమా బావుంది కదా...శంకర్ ఎక్సలెంట్‌గా తీసాడు" అని చెప్పాడు. "ఆ...అవున్లే బాగా తీసాడు. ఇంతకీ నువ్వెప్పుడు చూసావు.  DC++ లోనా ( ఇది కాలేజ్‌లో ఉండే ఓ internal కంప్యూటర్  నెట‌వర్క్. సినిమాలు, పాటలు, సాఫ్ట్‌వేర్లు విద్యార్దులు ఇందులో ఇచ్చిపుచ్చుకుంటారు ) ? అని అడిగాన్నేను. " లేద్రా...బాంబే థియేటర్లో మధ్యాహ్నం చూసానురా. నిన్న మధ్యాహ్నం నుండే వేసాడు తెలుగు వెర్షన్‌" అని రిప్లై ఇచ్చాడు. వాడిచ్చిన సమాధానానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఎందుకంటారా...... సదరు బాంబే థియేటరు క్యాంపస్‌ నుండి సైకిల్‌పై అరగంట దూరం..... :(


"టికెట్ ఎంతరా" విషణ్ణవదనుడనై అడిగాను వాడిని.
బ్యాక్‌గ్రౌండులో మంద్రంగా సంగీతం వినపడటం మొదలుపెట్టింది నాకు.
"ముప్ఫై రూపాయలు రా" అని చిద్విలాసంగా సెలవిచ్చాడు నరేష్‌గాడు.


హరిమా హరిమా నేనో సింహపు కొదమా, నువ్వో జింకై వస్తే కొమ్మా వదలనులెమ్మా....
పాట ఫుల్‌గా వినపడుతుంది నాకు. అప్పుడు పులి చేతిలో, నిన్న సింహం చేతిలో...ఛీ వెధవది...



***********************************************************************************

ఇతి రోబో చిత్ర దర్శనార్థం మత్‌ చే కర్మాణి సమస్థ అవస్థయహః సమాప్తహః
కావున ప్రజలారా, ఈ కథను విన్నవారు కన్నవారు రైలు ఎక్కేప్పుడు తమ టికెట్టు పరిధిని ఒకటికి పదిసార్లు చూచుకుందురని. సీట్లు ఖాళీగా ఉన్నాయని ఏ కంపార్టుమెంటు కనపడితే ఆ కంపార్టుమెంటు ఎక్కవద్దనీ. సినిమాకు వెళ్లెముందు పూర్తి అవగాహనతో వెళ్లెదరని. తద్వారా సఖపడెదరనీ  ఖరగ్‌పురాణం ద్వితీయార్థం సినిమా పర్వములో నాగార్జునాచార్యుడు ప్రపచించెను.

ఆఆ సినిమా ఐపోయింది. ఇంకా కూర్చున్నారేంటి. లేవండి లేవండి. వెళ్లేటప్పుడు సినిమా చూసినందుకు డబ్బులు కట్టి వెళ్లండి.


మన సారాంస గీతం - తప్పక చూడండి

 చాలా రోజుల క్రితం కత్తి మహేశ్ గారి బ్లాగ్‌లో అనుకుంటా, తమిళనాడులో వాళ్ల భాషకు సంబంధించిన వేడుక సందర్భంగా AR Rahman చేసిన ఒక థీం సాంగ్ ( సారాంస గీతం - రమణా రావు గారి పోస్టు వల్ల తెలియవచ్చింది ) తయారు చేసారని రాసారు. మహేశ్ గారు దాన్ని ఉదహరిస్తూ అలాంటి ప్రయత్నం మనవాళ్ళు ఎందుకు చేయడంలేదు అని అడిగారు. అది చూసి కొంత విస్మయం, బాధ కలిగాయి.....నిజంగానే అలాంటి ప్రయత్నం ఇన్నిరోజులు ఎందుకు జరగలేదని.

ఇవాళ ఓ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో అలా బ్రౌజ్ చేస్తుంటే ఫ్రెండొకడు పెట్టిన వీడియో కట్టి పడేసింది. ఆఖరకు మనకు కూడా మన రాష్టాన్ని ప్రతిబింబించే ఒక పాట తయారైనందుకు ఆనందంగా ఉంది.




much accolades to the makers of the song

గమనిక : ఈ బ్లాగులో వీడియోను చూడలేకపోతే Youtube లో " Andhra Pradesh theme song " అని వెతకండి

Exictement లో ఏం రాస్తున్నానో తెలియడంలేదు. కాని మీరు వీడియోని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా....

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరొక దృశ్య కావ్యం

ShareThis